
Pakistan vs Namibia : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో నమీబియాపై 102 పరుగుల భారీ విజయంతో ఘనంగా సూపర్-8 రౌండ్లోకి దూసుకెళ్లింది. కొలంబో వేదికగా జరిగిన ఈ పోరులో పాక్ బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి పసికూనను మట్టికరిపించారు. ఈ గెలుపుతో ఈ మెగా టోర్నీలో సూపర్-8కు చేరిన ఎనిమిదో, ఆఖరి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఇప్పటికే భారత్, జింబాబ్వే సహా ఏడు జట్లు తదుపరి రౌండ్కు చేరుకోగా, ఇప్పుడు పాక్ కూడా ఆ జాబితాలో చేరింది.
ఈ మ్యాచ్లో పాక్ విజయంలో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ హీరోగా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డ ఫర్హాన్.. కేవలం 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. అతనికి తోడుగా కెప్టెన్ సల్మాన్ ఆగా 38 పరుగులతో రాణించగా, ఆఖర్లో షాదాబ్ ఖాన్ కేవలం 22 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాకు పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆది నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చిన నమీబియా జట్టు ఏ దశలోనూ పాక్కు పోటీ ఇవ్వలేకపోయింది. పాక్ బౌలర్ల ధాటికి నమీబియా కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 102 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుని టోర్నీలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ విజయంతో పాక్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
పాకిస్థాన్ సూపర్-8కు క్వాలిఫై అవ్వడంతో ఇప్పుడు మరోసారి భారత్ – పాక్ హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్, ఇప్పుడు సూపర్-8లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నెగ్గుకు రావడంతో టోర్నీలో అసలు సిసలు మజా మొదలైందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..