
T20 Captain : భారత టీ20 క్రికెట్లో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది.. తదుపరి కెప్టెన్ ఎవరు? 2028 టీ20 వరల్డ్ కప్, అదే ఏడాది జరిగే ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ (BCCI) ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త రక్తాన్ని ఎక్కించాలని బోర్డు భావిస్తోంది. ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్. మరి ఈ ఇద్దరిలో టీమిండియా పగ్గాలు చేపట్టే సత్తా ఎవరికి ఉంది? గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఒకసారి వివరంగా తెలుసుకుందాం.
కెప్టెన్సీ అనుభవం గురించి మాట్లాడితే శ్రేయస్ అయ్యర్ చాలా ముందున్నాడు. 2018-19 నుండే అతను కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ను విజయవంతంగా నడిపించడమే కాకుండా, కోల్కతా నైట్ రైడర్స్ (KKR)కు టైటిల్ కూడా అందించాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టును కూడా నడిపించిన ఘనత అయ్యర్ సొంతం. గిల్ ఐపీఎల్లో అడుగుపెట్టినప్పుడే అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాబట్టి ప్రెజర్ హ్యాండిల్ చేయడంలో అయ్యర్కు తిరుగులేదు.
మరోవైపు శుభ్మన్ గిల్ భారత క్రికెట్ ప్రిన్స్గా ఎదుగుతున్నాడు. గిల్ గతేడాదే టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్ అయ్యాడు. ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్ను 2-2తో డ్రా చేయడంలో గిల్ కెప్టెన్సీని చాలా మంది మెచ్చుకున్నారు. అయితే, కొందరు విమర్శకులు గిల్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ వంటి వారు గిల్ బౌలర్లను సరిగ్గా వాడుకోవడంలో ఇంకా మెరుగుపడాలని సూచించారు. వైట్ బాల్ క్రికెట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓటములు గిల్ కెప్టెన్సీ రికార్డుపై కొంచెం మచ్చగా మిగిలాయి.
గణాంకాలను పరిశీలిస్తే.. ఐపీఎల్ లో శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కు 36 మ్యాచ్ల్లో నాయకత్వం వహించి 20 విజయాలు అందుకున్నాడు. అతని విన్నింగ్ పర్సెంటేజ్ 55.55%. అదే శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే, అతను ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్ జట్ల తరపున మొత్తం 97 మ్యాచ్లకు కెప్టెన్సీ చేశాడు. ఇందులో 54 విజయాలతో 58.51% విన్నింగ్ రేటు కలిగి ఉన్నాడు. ఈ లెక్కల ప్రకారం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా గిల్ కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చాడు.
శుభ్మన్ గిల్ భవిష్యత్తు కెప్టెన్గా ఎదగడంలో సందేహం లేదు. అతను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. అయితే 2028 వంటి మెగా టోర్నమెంట్ల కోసం తక్షణమే ఒక పటిష్టమైన కెప్టెన్ కావాలంటే శ్రేయస్ అయ్యర్ సరైన ఎంపికగా కనిపిస్తున్నాడు. అయ్యర్ కి ఉన్న అనుభవం, వ్యూహాలు టీ20 ఫార్మాట్లో జట్టుకు బాగా కలిసొస్తాయి. మరి బీసీసీఐ సంప్రదాయ పద్ధతిలో అనుభవానికి ప్రాధాన్యత ఇస్తుందో లేక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గిల్కు పట్టం కడుతుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..