Mohsin Naqvi : బంగ్లాదేశ్‌ను బలిపశువును చేసిన పాకిస్థాన్.. మొహ్సిన్ నఖ్వీ వేసిన స్కెచ్ మామూలుగా లేదుగా!

Mohsin Naqvi : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్ వేదికగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన డ్రామా వెనుక అసలు సూత్రధారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అని తాజాగా వెలుగులోకి వచ్చింది.

Mohsin Naqvi : బంగ్లాదేశ్‌ను బలిపశువును చేసిన పాకిస్థాన్.. మొహ్సిన్ నఖ్వీ వేసిన స్కెచ్ మామూలుగా లేదుగా!
Mohsin Naqvi

Updated on: Feb 20, 2026 | 8:09 PM

Mohsin Naqvi : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్ వేదికగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన డ్రామా వెనుక అసలు సూత్రధారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అని తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లో అడుగుపెట్టేందుకు బంగ్లాదేశ్‌ను ఒప్పించకుండా, వారిని రెచ్చగొట్టి టోర్నీ నుంచి తప్పుకునేలా చేయడంలో నఖ్వీ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏమిటీ వివాదం? అసలేం జరిగింది?

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్‌కు వచ్చేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ భద్రతా కారణాల దృష్ట్యా నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ సమయంలో పాకిస్థాన్ కూడా బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచి, తాము కూడా భారత్‌తో ఆడే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ఐసీసీని బెదిరించింది. చివరకు ఐసీసీ జోక్యంతో పాకిస్థాన్ దారికి వచ్చినప్పటికీ, బంగ్లాదేశ్ మాత్రం తన పంతం వీడలేదు. ఫలితంగా ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానాన్ని స్కాట్లాండ్‌కు కేటాయించింది.

మొహ్సిన్ నఖ్వీ ట్రాప్‎లో బంగ్లాదేశ్?

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అష్రఫుల్ హక్ తాజాగా రేవ్‌స్పోర్ట్స్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలు వెల్లడించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, పాక్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాటలు నమ్మి మోసపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “అమినుల్ ఇస్లాం చాలా అమాయకంగా నఖ్వీ వేసిన ఉచ్చులో పడిపోయారు. నఖ్వీ తన మాటలతో అమినుల్‌ను ప్రభావితం చేసి, భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించారు. దీనివల్ల బంగ్లాదేశ్ క్రికెట్ ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతింది” అని అష్రఫుల్ మండిపడ్డారు.

పాకిస్థాన్ డ్రామా.. చివరికి 61 పరుగుల ఓటమి

పాకిస్థాన్ కూడా మొదట భారత్‌తో ఆడబోమని భీష్మించుక కూర్చుంది. కానీ, ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో తోకముడిచింది. మాకు వ్యక్తిగత ప్రయోజనం లేదు, కేవలం బంగ్లాదేశ్‌కు గౌరవం దక్కాలనే మేం పోరాడాం అని నఖ్వీ అప్పట్లో బిల్డప్ ఇచ్చినప్పటికీ, అసలు ఉద్దేశం భారత్‌ను ఇబ్బంది పెట్టడమేనని ఇప్పుడు అర్థమవుతోంది. తీరా మ్యాచ్ ఆడిన తర్వాత, భారత జట్టు పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పింది.

బంగ్లాదేశ్ క్రికెట్‌కు తీరని నష్టం

అష్రఫుల్ హక్ అభిప్రాయం ప్రకారం.. రాజకీయాల వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ 5 నుంచి 10 ఏళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ముస్తాఫిజుర్ రెహమాన్, లిటన్ దాస్ వంటి సీనియర్ ఆటగాళ్లకు ఇది చివరి వరల్డ్ కప్ కావొచ్చు, కానీ బోర్డు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల వారు ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయారు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us