
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగనున్న షమీ.. తన 100వ ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ఆయనను ఘనంగా సత్కరించింది.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం దులీప్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు శనివారం షమీని CAB తరఫున సత్కరించారు. CAB అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంతకం చేసిన ప్రత్యేక ‘నెం.100 బెంగాల్ జెర్సీని’ కోశాధికారి సంజయ్ దాస్ షమీకి అందజేశారు. అలాగే గంగూలీ సంతకం చేసిన ప్రత్యేక బంతితో పాటు వెండి ఫలకాన్ని కూడా బహూకరించారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని షమీ కేక్ కట్ చేశారు. ఈస్ట్ జోన్ సహచరులు సంతకం చేసిన మరో జెర్సీని కూడా ఆయనకు అందించారు. కెప్టెన్ ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, ముఖేశ్ కుమార్ షమీతో కలిసి ఫొటో దిగారు.
ఈస్ట్ జోన్ జట్టు సభ్యులకు సౌరవ్ గంగూలీ తరఫున స్వీట్ల పెట్టెలను అందించారు. ఫైనల్లో కేవలం పాల్గొనడానికి కాకుండా గెలవడానికి ఆడాలని, దూకుడుగా వ్యవహరిస్తూ ఒకరి కోసం ఒకరు ఆడాలని గంగూలీ సూచించారు. దులీప్ ట్రోఫీని సొంతం చేసుకుని ఈస్ట్ జోన్కు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఫైనల్కు ముందు ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ షమీపై ప్రశంసలు కురిపించాడు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, షమీ అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పాడు. జట్టులో షమీ ఉండటం తమకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందని పేర్కొన్నాడు. షమీ తీవ్రత, శక్తి ప్రస్తుతం చాలా భిన్నంగా కనిపిస్తున్నాయని ఇషాన్ తెలిపాడు. వికెట్లు తీయగల బౌలర్ జట్టులో ఉండటం ఎంతో కీలకమని అన్నాడు.
ప్రస్తుతం భారత సెలెక్టర్ల ప్రణాళికల్లో లేకపోయినా షమీ దేశవాళీ క్రికెట్ ఆడుతూ తన పునరాగమనంపై ఆశలు కొనసాగిస్తున్నాడని ఇషాన్ వెల్లడించాడు. 2023 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించిన షమీ.. ఆ తర్వాత భారత్కు క్రమం తప్పకుండా ఆడకపోయినా దేశవాళీ క్రికెట్పై అదే పట్టుదల చూపిస్తున్నాడని ప్రశంసించాడు. షమీలో తిరిగి భారత జట్టులోకి రావాలనే తపన, ప్రేరణ స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇషాన్ చెప్పాడు. తాను కెప్టెన్గా ఉన్నప్పుడు వివిధ మ్యాచ్ పరిస్థితుల్లో ఎలా ఆడాలనే విషయంపై షమీ విలువైన సూచనలు ఇస్తున్నాడని తెలిపాడు.