Video: ‘పాకిస్తాన్‌లో అడుగుపెడితే రాళ్లతో కొడతారోయ్’.. రిజ్వాన్‌ను అవమానించిన బంగ్లా ప్లేయర్

Litton Das sledging Mohammad Rizwan: పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతుంటే, మరోవైపు ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్ దాయాది జట్టును మరింత ఇరకాటంలో పడేస్తోంది. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్, పాక్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్‌ను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెను సంచలనం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video: పాకిస్తాన్‌లో అడుగుపెడితే రాళ్లతో కొడతారోయ్.. రిజ్వాన్‌ను అవమానించిన బంగ్లా ప్లేయర్
Litton Das Sledging Mohammad Rizwan

Updated on: May 12, 2026 | 7:48 PM

Litton Das sledging Mohammad Rizwan: నజ్ముల్ శాంతో నాయకత్వంలోని బంగ్లాదేశ్ జట్టు మంగళవారం పాకిస్థాన్‌ను 104 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గత రెండేళ్లుగా పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించడం గమనార్హం. 2024లో పాకిస్థాన్ గడ్డపైనే క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, ఇప్పుడు సొంత గడ్డపై కూడా అదే జోరును ప్రదర్శిస్తోంది.

రిజ్వాన్‌ను టార్గెట్ చేసిన లిటన్ దాస్..

మ్యాచ్ నిర్ణయాత్మకమైన ఐదో రోజున పాకిస్థాన్ 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే వరుసగా వికెట్లు కోల్పోయి 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న మొహమ్మద్ రిజ్వాన్‌పై బంగ్లాదేశ్ కీపర్ లిటన్ దాస్ మాటల యుద్ధానికి దిగాడు. రిజ్వాన్ వికెట్ తీస్తే విజయం ఖాయమని భావించిన లిటన్ దాస్, మానసికంగా అతడిని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.

“పాకిస్థాన్‌లో రిజ్వాన్ పరువు పూర్తిగా పోయింది. ఒకవేళ ఇప్పుడు భారీ షాట్ కొట్టి అవుట్ అయితే, అతను తిరిగి తన దేశంలో అడుగు కూడా పెట్టలేడు. అక్కడ అతని పరిస్థితి అంత దారుణంగా ఉంది” అని లిటన్ దాస్ మైదానంలో వ్యాఖ్యానించాడు. ఈ మాటలు స్టంప్ మైక్ ద్వారా స్పష్టంగా వినిపించాయి.

పాతాళానికి రిజ్వాన్ ఫామ్..

గత కొన్నేళ్లుగా మొహమ్మద్ రిజ్వాన్ ఫామ్ దారుణంగా పడిపోయింది. 2023 నుంచి అన్ని ఫార్మాట్లలో అతని సగటు 62 నుంచి కేవలం 26కు పడిపోయింది. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన రిజ్వాన్, ఇప్పుడు టెస్టుల్లో కూడా విఫలమవుతుండటంతో పాక్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యాడు.

రెండో టెస్టుకు బాబర్ ఆజం పునరాగమనం..

తొలి టెస్టులో ఓటమి చవిచూసిన పాకిస్థాన్‌కు మే 16 నుంచి సిల్హెట్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఊరట లభించనుంది. మోకాలి గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తిరిగి జట్టులోకి రానున్నాడు. బాబర్ రాకతో రిజ్వాన్ తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us