
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ సారథి ఈషాన్ కిషన్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రత్యర్థి బౌలర్లను నలువైపులా బాదుతూ గ్రౌండ్లో పరుగుల వరద పారించాడు. మొత్తం 334 బంతులను ఎదుర్కొన్న కిషన్ ఏకంగా 270 పరుగులు సాధించి జట్టుకు కొండంత కొండలాంటి స్కోరును అందించాడు. అతడి మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్లో 30 ఫోర్లు, 7 మెరుపు సిక్సర్లు ఉన్నాయి. కేవలం 270 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు, క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అతడి సూపర్ షో పుణ్యమా అని ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచగలిగింది.
వృద్ధిమాన్ సహా రికార్డు గాల్లో
ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్తో ఈషాన్ కిషన్ పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాడు. గతంలో దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఈస్ట్ జోన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు వృద్ధిమాన్ సహా పేరిట ఉండేది. 2012 ఫైనల్లో సహా 170 పరుగులు చేశాడు. ఇప్పుడు 270 పరుగుల ఇన్నింగ్స్తో సహా రికార్డును ఈషాన్ అధిగమించాడు. ఈస్ట్ జోన్ నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో డబుల్ సెంచరీ బాదిన మొదటి బ్యాటర్గా ఈషాన్ నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
దినేష్ కార్తీక్ రికార్డు బద్దలు
కెప్టెన్ గానే కాకుండా వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈషాన్ కిషన్, ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఈ విధ్వంసం సృష్టించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్గా నిలిచి భారత దిగ్గజం దినేష్ కార్తీక్ రికార్డును చెరిపివేశాడు. 2010 దులీప్ ట్రోఫీ ఫైనల్లో దినేష్ కార్తీక్ 183 పరుగులు చేయగా, ఇప్పుడు ఈషాన్ 270 పరుగులతో ఆ రికార్డును దాటేశాడు. కీపర్ కెప్టెన్గా దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్గా ఈషాన్ ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
దిగ్గజాల సరసన అరుదైన మైలురాయి
దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఈస్ట్ జోన్ తరఫున డబుల్ సెంచరీ బాదిన మూడో బ్యాటర్గా ఈషాన్ కిషన్ నిలిచాడు. అతడికంటే ముందు అరుణ్ లాల్, సబా కరీమ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా చూస్తే దులీప్ ట్రోఫీ ఫైనల్ సమరంలో 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏడో బ్యాటర్గా ఈషాన్ చరిత్రకెక్కాడు. అద్భుతమైన ఫామ్తో చెలరేగుతున్న ఈ యంగ్ వికెట్ కీపర్ ఇన్నింగ్స్ ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..