Vaibhav Suryavanshi : ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. అభిషేక్ శర్మ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు

Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో చరిత్ర సృష్టించాడు. 43 సిక్సర్లతో అభిషేక్ శర్మ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు సాధించాడు.

Vaibhav Suryavanshi : ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. అభిషేక్ శర్మ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు
Vaibhav Suryavanshi

Updated on: May 18, 2026 | 7:17 AM

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక 15 ఏళ్ల కుర్రాడు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి పరుగుల విధ్వంసం సృష్టించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కేవలం తన బ్యాటింగ్‌తోనే కాకుండా, సిక్సర్ల సునామీతో ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వైభవ్ ఏకంగా 43 సిక్సర్లు బాది, ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అభిషేక్ శర్మ రికార్డ్ బ్రేక్

గతంలో 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ 42 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును చెరిపివేశాడు. ఈ సీజన్‌లో వైభవ్ కొట్టిన 43 సిక్సర్లలో 35 సిక్సర్లు కేవలం పవర్‌ప్లేలోనే రావడం విశేషం. అంటే మొదటి ఆరు ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్ల పని పడుతూ రాజస్థాన్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తున్నాడు. 15 ఏళ్ల వయసులో ఇంతటి పవర్ హిట్టింగ్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు.

తొలి బంతికే సిక్సర్.. పడిక్కల్ సరసన వైభవ్

ఈ మ్యాచ్‌లో లుంగీ ఎన్గిడి వేసిన తొలి బంతికే వైభవ్ సిక్సర్ బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో మూడుసార్లు తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ కొట్టిన నలుగురు ఆటగాళ్ల జాబితాలో వైభవ్ చేరిపోయాడు. గతంలో షారుఖ్ ఖాన్ (2023), సునీల్ నరైన్ (2025) ఈ ఘనత సాధించగా.. తాజా మ్యాచులో ఆర్సీబీ స్టార్ దేవదత్ పడిక్కల్ కూడా ఈ ఫీట్ అందుకున్నాడు. వెనువెంటనే వైభవ్ కూడా అదే ఫీట్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

యశస్వి జైస్వాల్‌నే పక్కకు నెట్టేసి..!

రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్‌లో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అత్యంత కీలక ఆటగాడిగా మారిపోయాడు. సీనియర్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కంటే కూడా వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచుల్లో 486 పరుగులు చేసిన వైభవ్.. 234.78 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. కేవలం 14 పరుగుల తేడాతో 500 పరుగుల మైలురాయిని తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అతని నిలకడ చూస్తుంటే భవిష్యత్తులో టీమిండియాకు మరో స్టార్ దొరికేసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us