Virat Kohli : ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లీతో గొడవ.. ట్రావిస్ హెడ్ భార్యకు నెటిజన్ల వేధింపులు

Virat Kohli : ఐపీఎల్ 2026లో కోహ్లీ ట్రావిస్ హెడ్ మధ్య గొడవ ముదిరింది. హెడ్ భార్య పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. వరల్డ్ కప్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ జెస్సికా హెడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Virat Kohli : ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లీతో గొడవ.. ట్రావిస్ హెడ్ భార్యకు నెటిజన్ల వేధింపులు
Travis Head

Updated on: May 26, 2026 | 7:25 AM

Virat Kohli : ఐపీఎల్ అంటేనే ఉద్వేగాలకు వేదిక. కానీ, కొన్నిసార్లు ఈ ఉద్వేగాలు హద్దులు దాటుతున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక చిన్న గొడవ పెద్ద దుమారానికే దారితీసింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగింది. ఇది కేవలం ఆటతో ఆగకుండా, హెడ్ భార్య జెస్సికా వరకు పాకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హ్యాండ్ షేక్ ఇవ్వని విరాట్ కోహ్లీ

అసలేం జరిగిందంటే.. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీకి, హెడ్‌కు మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటుంటే, విరాట్ కోహ్లీ మాత్రం ట్రావిస్ హెడ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మలతో కరచాలనం చేసిన కోహ్లీ.. పక్కనే ఉన్న హెడ్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోయారు. హెడ్ చేయి చాచినా కోహ్లీ పట్టించుకోకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

మళ్ళీ మొదలైన ఆన్‌లైన్ అటాక్

ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కొంతమంది అతివాద క్రికెట్ అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా సోషల్ మీడియా ఖాతాలపై దాడి చేస్తున్నారు. వారు మూడు ఏళ్ల క్రితం పోస్ట్ చేసిన పెళ్లి ఫోటోల కింద అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ వేధిస్తున్నారు. అసలేమాత్రం సంబంధం లేని జెస్సికాను, ఆమె స్నేహితులను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత కూడా ఇలాగే జరగడం గమనార్హం.

హెడ్ భార్య జెస్సికా ఆవేదన

ఈ వేధింపులపై జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియా వద్ద స్పందించారు. “వరల్డ్ కప్ గెలిచినప్పుడు మాపై ఎలాంటి దాడి జరిగిందో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. నా సోషల్ మీడియా ఖాతాలు నోటిఫికేషన్లతో మోత మోగుతున్నాయి. మా ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ను టార్గెట్ చేయడం బాధాకరం. ఆటలో ఆవేశం ఉండవచ్చు, కానీ ఆటగాళ్ల వెనుక ఉండే మనుషులకు, కుటుంబాలకు కూడా భావోద్వేగాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి” అంటూ ఆమె హితవు పలికారు.

మెంటల్ హెల్త్ పైన దృష్టి పెట్టాలి

క్రీడల్లో గెలుపోటములు సహజమని, కానీ క్రీడాకారుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం సరైనది కాదని జెస్సికా పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ క్రీడాకారుల మానసిక ఆరోగ్యంపై చర్చ జరుగుతోందని, అభిమానులు సంయమనం పాటించాలని ఆమె కోరారు. ఒకవైపు ట్రావిస్ హెడ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “బాడీని గెస్ చేస్తూనే ఉండండి” అని అర్థం కాకుండా పెట్టిన పోస్ట్, కోహ్లీ హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడంపై కౌంటర్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us