
Sai Sudharsan : ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ సరికొత్త సంచలనం సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ తమిళనాడు కుర్రాడు చెలరేగి ఆడి 84 పరుగులు సాధించడమే కాకుండా, క్రికెట్ దిగ్గజాల సరసన నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్ల్లో యాభైకి పైగా పరుగులు (50+ స్కోర్లు) చేసిన ఆటగాళ్ల క్లబ్లో సుదర్శన్ చేరిపోయాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ లాంటి లెజెండ్స్ మాత్రమే సాధించిన ఈ అరుదైన మైలురాయిని ఇప్పుడు 24 ఏళ్ల సాయి సుదర్శన్ అందుకోవడం విశేషం.
ఐపీఎల్లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు..
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన 66వ లీగ్ మ్యాచ్లో సాయి సుదర్శన్ ఈ అద్భుత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్లో సుదర్శన్కు ఇది వరుసగా ఐదో హాఫ్ సెంచరీ కావడం విశేషం. కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి మొదటి వికెట్కు 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సుదర్శన్, ఈ సీజన్లో తన మొత్తం పరుగుల సంఖ్యను 600 దాటించాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్లో దూసుకుపోతున్న ఈ యంగ్ ఓపెనర్ సగటు ఈ టోర్నీలో 50 కంటే ఎక్కువగా ఉండటం అతని స్థిరత్వానికి నిదర్శనం.
గతంలో ఈ రికార్డు సాధించిన దిగ్గజాలు వీరే..
ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఐదు మ్యాచ్ల్లో 50 ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు గతంలో కేవలం ముగ్గురు బ్యాటర్ల పేరిట మాత్రమే ఉండేది. సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు బాదాడు. ఆ ఏడాది వార్నర్ 69.20 సగటుతో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీల సాయంతో 692 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇప్పుడు అదే తరహా ఫామ్ను సాయి సుదర్శన్ కూడా కొనసాగిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున జోస్ బట్లర్ విధ్వంసం
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2018 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ వరుసగా ఐదు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు మార్క్ అందుకున్నాడు. ఆ సీజన్లో బట్లర్ 54.80 సగటుతో 548 పరుగులు చేసి రాజస్థాన్ జట్టుకు వెన్నుముకగా నిలిచాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, నాడు రాజస్థాన్ తరఫున ఈ రికార్డు క్రియేట్ చేసిన జోస్ బట్లర్.. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టులో సాయి సుదర్శన్తో కలిసే బ్యాటింగ్ చేస్తుండటం విశేషం.
ఐపీఎల్ ఆరంభ రోజుల్లోనే రికార్డ్ సెట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్
టీ20 క్రికెట్ అనే దానికి సరైన అర్థం తెలియని రోజుల్లోనే ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్గా వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ 2012 సీజన్లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు. ఆ ఏడాది వీరూ 155.44 స్ట్రైక్ రేట్తో 495 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్గా సెహ్వాగ్ రికార్డు సృష్టించగా.. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ఒక భారతీయ బ్యాటర్గా సాయి సుదర్శన్ ఆ రికార్డును సమం చేశాడు.
రంజీల నుంచి టెస్ట్ క్రికెట్ దాకా..
గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ సాయి సుదర్శన్ గ్రాఫ్ వేగంగా పైకి దూసుకెళ్తోంది. రంజీ ట్రోఫీలో పరుగుల పండగ చేసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఐపీఎల్ 2025 సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. ఆ అద్భుత ప్రదర్శనతోనే భారత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026 లోనూ వరుసగా రెండో ఏడాది 500 కంటే ఎక్కువ పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ రేస్లో హాట్ ఫేవరెట్గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..