IPL 2026 Rising Stars: భారత క్రికెట్ తదుపరి స్టార్లు వీరేనా? ఐపీఎల్ 19వ సీజన్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ ఏడుగురు

IPL 2026 Rising Stars : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 19 సీజన్ మొదలు కాబోతుంది. ఐపీఎల్ 2026లో సత్తా చాటేందుకు ఏడుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు సిద్ధమయ్యారు. ఆకిబ్ నబీ, ప్రశాంత్ వీర్ వంటి యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో ఈ సీజన్‌లో హాట్ టాపిక్‌గా మారనున్నారు.

IPL 2026 Rising Stars: భారత క్రికెట్ తదుపరి స్టార్లు వీరేనా? ఐపీఎల్ 19వ సీజన్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ ఏడుగురు
Ipl 2026 Rising Stars

Updated on: Mar 19, 2026 | 11:10 AM

IPL 2026 Rising Stars: ఐపీఎల్ అంటేనే అనూహ్యమైన మలుపులకు, కొత్త టాలెంట్లకు కేరాఫ్ అడ్రస్. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. ప్రతి ఏటా విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లను అందించే ఈ వేదికపై ఈసారి కూడా కొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వేలంలో కోట్ల ధర పలికిన ఈ ఏడుగురు యువ కిశోరాలు ఈ సీజన్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు.

1. ఆకిబ్ నబీ దార్ (ఢిల్లీ క్యాపిటల్స్)

జమ్మూ కాశ్మీర్ స్పీడ్‌స్టర్ ఆకిబ్ నబీ దార్ ఈ సీజన్‌లో అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ.8.4 కోట్లు వెచ్చించి ఇతనిని దక్కించుకుంది. రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ తొలిసారి టైటిల్ గెలవడంలో ఆకిబ్ కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన ఈ పేసర్, బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడంలో దిట్ట. పవర్‌ప్లేలో ఇతను వేసే బంతులు బ్యాటర్లకు చుక్కలు చూపించడం ఖాయం.

2. ప్రశాంత్ వీర్ (చెన్నై సూపర్ కింగ్స్)

రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లిపోవడంతో, అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్‌కే తెచ్చిన ఆయుధమే ఈ ప్రశాంత్ వీర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ యువ ఆల్‌రౌండర్‌ను రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసి చరిత్ర సృష్టించింది సీఎస్‌కే. యూపీ టీ20 లీగ్‌లో 370 పరుగులు చేసి, 8 వికెట్లు తీసిన ప్రశాంత్, అచ్చం జడ్డూ లాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయగలడు. లోయర్ ఆర్డర్‌లో భారీ సిక్సర్లు బాదడం ఇతని ప్రత్యేకత.

3. కార్తీక్ శర్మ (చెన్నై సూపర్ కింగ్స్)

రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మపై కూడా సీఎస్‌కే రూ.14.2 కోట్లు కుమ్మరించింది. ఫినిషర్ రోల్‌లో ఇతను అద్భుతాలు చేయగలడని యాజమాన్యం నమ్ముతోంది. టీ20ల్లో 162.92 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసే కార్తీక్, తక్కువ బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. ధోనీ గైడెన్స్‌లో ఇతను ఏ స్థాయిలో రాణిస్తాడో చూడాలి.

4. విహాన్ మల్హోత్రా (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

అండర్-19 ప్రపంచకప్ స్టార్ విహాన్ మల్హోత్రాను ఆర్సీబీ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. జింబాబ్వేలో జరిగిన వరల్డ్ కప్‌లో 60 సగటుతో 240 పరుగులు చేసి ఇతను సత్తా చాటాడు. పంజాబ్ తరపున ఇంకా సీనియర్ అరంగేట్రం చేయకపోయినా, విహాన్ లో ఉన్న టెంపరామెంట్ ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్‌లో పెద్ద బలం కానుంది.

5. అశోక్ శర్మ (గుజరాత్ టైటాన్స్)

రాజస్థాన్ పేసర్ అశోక్ శర్మను గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 22 వికెట్లు తీసి జాయింట్ హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన అశోక్, డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయగలడు. షమీ, సిరాజ్ వంటి దిగ్గజాల సరసన ఇతను మరింత పదును పెంచుకోనున్నాడు.

6. తేజస్వి సింగ్ దహియా (కోల్‌కతా నైట్ రైడర్స్)

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో చెలరేగిన తేజస్వి సింగ్‌ను కేకేఆర్ రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన తేజస్వి, టీ20ల్లో 190కి పైగా స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించగలడు. కేకేఆర్ మిడిల్ ఆర్డర్‌లో ఇతను ఫినిషర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

7. మంగేష్ యాదవ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

కేవలం ఐదు దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న మంగేష్ యాదవ్‌పై ఆర్సీబీ ఏకంగా రూ.5.2 కోట్లు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంపీ టీ20 లీగ్‌లో 6 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన మంగేష్, డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో స్పెషలిస్ట్. యశ్ దయాల్‌కు ప్రత్యామ్నాయంగా ఇతను జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us