
SRH Defeat Reasons: ఐపీఎల్ 2026 సీజన్ శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆరు వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కింగ్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 పరుగులతో రాణించినప్పటికీ, బౌలర్ల వైఫల్యం జట్టు కొంపముంచింది. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, విరాట్ కోహ్లీ క్రీజులో సెట్ అయ్యే వరకు అవకాశం ఇవ్వడం ఓటమిని శాసించాయి. యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అంచనాలను అందుకోలేకపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అతను తడబడటం జట్టుపై ప్రభావం చూపింది.
మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన ఇషాన్ కిషన్, తమ బౌలింగ్ ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. “పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది, చిన్నస్వామి స్టేడియంలో మరికొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది” అని పేర్కొన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం, కోహ్లీ వికెట్ను త్వరగా తీయలేకపోవడం తమ ఓటమికి ప్రధాన కారణాలని కిషన్ అంగీకరించాడు.
నితీష్ కుమార్ రెడ్డి ప్రదర్శన నిరాశపరిచినప్పటికీ, తదుపరి మ్యాచ్లలో అతను ఖచ్చితంగా పుంజుకుంటాడని ఇషాన్ ధీమా వ్యక్తం చేశాడు. అతను ఒక సీనియర్ ప్లేయర్ అని, జట్టుకు అతని నుంచి మెరుగైన ప్రదర్శన అవసరమని తెలిపాడు. ఇది కేవలం తొలి మ్యాచ్ మాత్రమేనని, లోపాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచుల్లో గట్టి పోటీ ఇస్తామని ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ స్పష్టం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..