
IPL 2026 RCB : ఐపీఎల్ 2026 అసలైన మజా రేపటి నుంచే (మార్చి 28) మొదలవ్వనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), తమ మొదటి పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, కింగ్ కోహ్లీ సేన గెలుపుతో బోణీ కొట్టాలని చూస్తుంటే, మ్యాచ్కు ముందే ఆర్సీబీకి ఒక గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ ఈ కీలకమైన ఓపెనింగ్ మ్యాచ్కు దూరం కావడం అభిమానులను కలవరపెడుతోంది.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి కొన్ని గంటల ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చేదు వార్త అందింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హేజిల్వుడ్ ఫిట్నెస్ కారణాలతో తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. నిజానికి హేజిల్వుడ్ గురువారమే బెంగళూరు చేరుకున్నప్పటికీ, అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. “జోష్ ప్రస్తుతం బరిలోకి దిగడానికి సిద్ధంగా లేడు, మేము అతని ఫిట్నెస్ను నిశితంగా గమనిస్తున్నాము” అని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా హేజిల్వుడ్ అకిలెస్ హీల్ (మడమ గాయం), హాంస్ట్రింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ గాయాల కారణంగానే అతను ప్రసిద్ధ యాషెస్ సిరీస్తో పాటు టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా ఆస్ట్రేలియా జట్టులో చోటు కోల్పోయాడు. నవంబర్ 2025 నుంచి అతను మైదానానికి దూరంగానే ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఐపీఎల్తో రీఎంట్రీ చేస్తాడని ఆశించిన అభిమానులకు, అతని గైర్హాజరీ తీవ్ర నిరాశను మిగిల్చింది. హేజిల్వుడ్ స్థానంలో జట్టులో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆర్సీబీ గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటంలో జోష్ హేజిల్వుడ్ పాత్ర మరువలేనిది. గత సీజన్లో అతను 12 మ్యాచ్లు ఆడి ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 8.77 ఎకానమీతో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. ఇప్పుడు అతను లేకపోవడంతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్ వంటి ఇతర పేసర్లు ఇప్పుడు అదనపు బాధ్యతను మోయాల్సి ఉంటుంది.
The Myth. The Legend. The 𝗛𝗮𝘇𝗹𝗲𝗚𝗢𝗗. 🙇♂️
Back in Red, Blue, and Gold. Back to BLR. Just where he truly belongs. 🏠🔥
Bengaluru, our ⭐️ has returned. ❤️🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 pic.twitter.com/hgoBrGboJq
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 26, 2026
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఈసారి ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు. చిన్నస్వామి వంటి చిన్న స్టేడియంలో వారిని అడ్డుకోవాలంటే హేజిల్వుడ్ వంటి అనుభవం ఉన్న బౌలర్ అవసరం చాలా ఉంది. అయినప్పటికీ, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి స్టార్ బ్యాటర్లతో ఆర్సీబీ పటిష్టంగానే ఉంది. రేపు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ పోరులో గెలిచి, టైటిల్ డిఫెన్స్ను ఘనంగా ప్రారంభించాలని బెంగళూరు పట్టుదలతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..