IPL 2026 : ఐపీఎల్లో బంగ్లా ఆటగాళ్లకు రెడ్ కార్డ్? ముస్తాఫిజుర్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
IPL 2026 : భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఉన్న మాట వాస్తవమే అయినా, ఆటగాళ్లను అడ్డుకోవాలని భారత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను భారీ ధరకు కొనుగోలు చేయడంతో మొదలైన వివాదం ఇప్పుడు ముదురుతోంది.

IPL 2026 : ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఐపీఎల్ 2026 సీజన్లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల భాగస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను భారీ ధరకు కొనుగోలు చేయడంతో మొదలైన వివాదం ఇప్పుడు ముదురుతోంది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్ల భవిష్యత్తుపై బీసీసీఐ ఎట్టకేలకు స్పందించింది.
బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి తప్పించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్న తరుణంలో బీసీసీఐ వర్గాలు కీలక సమాచారాన్ని అందించాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఉన్న మాట వాస్తవమే అయినా, ఆటగాళ్లను అడ్డుకోవాలని భారత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. “ఇది మా చేతుల్లో లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన గైడ్లైన్స్ వస్తే తప్ప మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. ప్రస్తుతానికి బంగ్లా ఆటగాళ్లపై ఎలాంటి నిషేధం లేదు” అని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఒక అధికారి తెలిపారు.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఏకంగా రూ.9.20 కోట్లకు కొనుగోలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ముస్తాఫిజుర్కు ఐపీఎల్లో అపారమైన అనుభవం ఉంది. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్తో అరంగేట్రం చేసిన అతను, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 60 ఐపీఎల్ మ్యాచ్ల్లో 65 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
కేవలం ముస్తాఫిజుర్ కొనుగోలు మాత్రమే కాదు, షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కేకేఆర్ టీమ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్తో సంబంధాలు సరిగా లేని సమయంలో ఆ దేశ ఆటగాళ్లకు కోట్ల రూపాయలు పోయడం ఏంటని కొందరు రాజకీయ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ గాయపడినప్పుడు రీప్లేస్మెంట్గా ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన ముస్తాఫిజుర్, ఈసారి కేకేఆర్ ప్రధాన బౌలింగ్ అస్త్రంగా మారాడు. అయితే భద్రతా కారణాలు లేదా ప్రభుత్వ ఒత్తిడి పెరిగితే చివరి నిమిషంలో పరిస్థితులు మారే అవకాశం ఉంది.
మరోవైపు టీమిండియా సెప్టెంబర్ 2026లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ 3 వన్డేలు, 3 టీ20ల షెడ్యూల్ ఖరారైంది. ఒకవేళ ఐపీఎల్లో బంగ్లా ఆటగాళ్లపై నిరసనలు మిన్నంటితే, టీమిండియా పర్యటనపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. బీసీసీఐ ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండటంతో, అప్పటికి రాజకీయ పరిస్థితులు సద్దుమణిగితే బంగ్లా ఆటగాళ్లకు ఇబ్బంది ఉండదు. లేని పక్షంలో పాకిస్థాన్ ఆటగాళ్ల తరహాలోనే బంగ్లా ప్లేయర్లపై కూడా అనధికారిక నిషేధం పడే ప్రమాదం పొంచి ఉంది.
