ఇల్లా.. సినిమా సెట్టా..! ఈ ఫిమేల్ క్రికెటర్ ఫామ్ హౌస్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన ఆటతీరుతోనే కాకుండా తన జీవనశైలితోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ జతిన్ సప్రూతో కలిసి మహారాష్ట్రలోని సాంగ్లీలో ఉన్న తన సరికొత్త ఫామ్హౌస్ను ఆమె ప్రపంచానికి పరిచయం చేసింది. బాలీవుడ్ సినిమాల్లోని రాజభవనాలను తలపించేలా ఉన్న ఈ ఫామ్హౌస్ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే స్మృతి మంధానకు సినిమా తరహాలో ఒక అద్భుతమైన ఇంటిని నిర్మించుకోవాలనే కోరిక ఉండేది. కరణ్ జోహార్, సూరజ్ బర్జాత్యా వంటి దర్శకుల సినిమాల స్ఫూర్తితో ఆమె తన ఫామ్హౌస్ను అత్యంత విలాసవంతంగా డిజైన్ చేయించుకుంది. ప్రాక్టీస్ కోసం ప్రత్యేకమైన మైదానం నుండి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ వరకు ఈ ఇంట్లో ఉన్న ప్రత్యేకతలు చూద్దాం.
బాలీవుడ్ సెట్టింగ్ను తలపించేలా..
మహారాష్ట్రలోని సాంగ్లీలో నిర్మితమవుతున్న ఈ ఫామ్హౌస్ ప్రధాన ద్వారం ఎంతో భారీగా ఉంటుంది. చిన్నప్పటి నుండి బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగిన స్మృతికి ఆ సినిమాల్లో ఉండేలాంటి ఒక పెద్ద ఎంట్రన్స్ డోర్ కావాలని ఉండేది. దాని ప్రకారమే కరణ్ జోహార్ సినిమాల సెట్ల నుండి స్ఫూర్తి పొంది ఈ ద్వారాన్ని రూపొందించారు. ఇంటి ముందు భాగంలో గుండ్రటి నడక దారితో కూడిన విశాలమైన ఉద్యానవనం ఉంది.
ఇది చూడటానికి ఒక కోట లాంటి అనుభూతిని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి వీలుగా చుట్టూ పచ్చని మొక్కలు, చెట్లను నాటడానికి తగినంత ఖాళీ స్థలాన్ని వదిలారు. ఇంటి లోపల గుండ్రటి చెక్క మెట్లు, వివిధ రకాల చెక్క అలంకరణలతో చాలా అందంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.
మైదానం – స్విమ్మింగ్ పూల్
ఈ ఫామ్హౌస్లో అన్నింటికంటే ఆకర్షణీయమైన భాగం క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మైదానం. స్మృతి మంధాన తన సాధనను కొనసాగించడానికి వీలుగా అన్ని రకాల వసతులతో కూడిన ఇండోర్ ప్లేగ్రౌండ్ను ఇక్కడ నిర్మించారు. అలాగే దీనికి ఆనుకుని ఒక పికిల్ బాల్ కోర్టు కూడా ఉంది. ఈ కోర్టు గోడలపై స్మృతి సాధించిన అంతర్జాతీయ క్రికెట్ విజయాల తాలూకు ఫొటోలను అలంకరించడం విశేషం. ఇంటి లోపల ఉండేలా ఏర్పాటు చేసిన సరికొత్త స్విమ్మింగ్ పూల్కు వాటర్ ఫాల్ (జలపాతం) ఎలిమెంట్ను జోడించారు. ఇది ఇంటి అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.
స్మృతి మంధాన రికార్డులు
టీమిండియా మహిళా జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టించింది. 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో ఆమె కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ క్రికెట్లో పది వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆమె, మూడు ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) సెంచరీలు చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. ఐసీసీ నుంచి 2018, 2021 సంవత్సరాలలో ‘ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను గెలుచుకుంది. ఎంతో కష్టపడి దేశానికి పేరు తెచ్చిన ఈ స్టార్ క్రికెటర్, తన కలల ఇంటిని కూడా అంతే అద్భుతంగా నిర్మించుకుంటోంది.
