Shafali Verma: చెన్నై టెస్టులో సంచలనం.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ సరికొత్త చరిత్ర..

|

Jun 28, 2024 | 3:44 PM

Shafali Verma Fastest Double Century: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చెన్నై టెస్టులో షఫాలీ వర్మ సంచలనం సృష్టించింది. తన 5వ టెస్టు మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన క్రీడాకారిణిగా షెఫాలీ వర్మ నిలిచింది.

Shafali Verma: చెన్నై టెస్టులో సంచలనం.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ సరికొత్త చరిత్ర..
Shafali Verma Fastest Double Century
Follow us on

Shafali Verma Fastest Double Century: చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో కెరీర్‌లో తొలి సెంచరీ సాధించి, పలు రికార్డులు నెలకొల్పిన షెఫాలీ.. ఇప్పుడు డబుల్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 200 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేయడం ద్వారా మహిళల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన క్రీడాకారిణిగా షెఫాలీ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. 2024లోనే, ఫిబ్రవరి నెలలో దక్షిణాఫ్రికాపై 248 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. అంతకు ముందు 2001లో ఇంగ్లండ్‌పై 306 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియాకు చెందిన కరెన్ రోల్టన్ పేరిట ఈ రికార్డు ఉంది.

రెండో భారత ప్లేయర్‌గా..

తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇటువంటి పరిస్థితిలో, షెఫాలీ వర్మ తన ఓపెనింగ్ భాగస్వామి స్మృతి మంధానతో కలిసి బ్యాటింగ్ కోసం క్రీజులోకి వచ్చింది. తొలి ఓవర్లలో కాస్త జాగ్రత్తగా ఆడిన ఆమె పిచ్‌ని అర్థం చేసుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత నిరంతరం పరుగులు సాధించింది. కేవలం 113 బంతుల్లో సెంచరీ సాధించింది. అవతలి వైపు నుంచి రెండు వికెట్లు పడ్డాయి. అయినప్పటికీ ఆమె ముందుకు సాగుతూ కేవలం 200 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించింది. ఈ క్రమంలో ప్రపంచంలో 10వ మహిళా క్రికెటర్‌గా, భారతదేశంలో డబుల్ సెంచరీ చేసిన రెండవ మహిళా క్రికెటర్‌గా నిలిచింది.

మంధానతో కలిసి రికార్డ్ భాగస్వామ్యం..

అంతకుముందు, షెఫాలీ వర్మ స్మృతి మంధానతో కలిసి 292 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దీంతో వీరిద్దరూ 20 ఏళ్ల పాకిస్థాన్‌ రికార్డును బద్దలు కొట్టారు. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన సాజిదా షా, కిరణ్ బలోచ్ పేరిట ఉంది. 2004లో వెస్టిండీస్‌పై వీరిద్దరూ తొలి వికెట్‌కు 241 పరుగులు జోడించారు. ఇది మాత్రమే కాదు, మంధాన ప్రపంచంలో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండవ జోడీగా నిలిచారు.

స్మృతి మంధాన 149 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌తో షెఫాలీ తుఫాన్ డబుల్ సెంచరీతో భారత జట్టును చాలా పటిష్ట స్థితిలో ఉంచింది. వార్త రాసే సమయానికి మూడో సెషన్‌లో టీమిండియా కేవలం 3 వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసింది. షెఫాలీ (205) పరుగులు చేసి పెవిలియన్ చేరింది. జెమిమా రోడ్రిగ్స్ 39, హర్మన్ ప్రీత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..