AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng : లార్డ్స్‌లో టీమిండియాకు వరుస షాక్‎లు..జులై 22న అయినా రాత మారేనా ?

క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లాండ్ మహిళల వన్డే సిరీస్ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. లార్డ్స్ మైదానంలో 9 రోజుల వ్యవధిలోనే భారత జట్టుకు రెండో ఓటమి ఎదురవడం కొంత నిరాశ కలిగించినా, సిరీస్‌లో ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే చివరి, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిస్థాయిలో రాణించాల్సి ఉంది.

Ind vs Eng : లార్డ్స్‌లో టీమిండియాకు వరుస షాక్‎లు..జులై 22న అయినా రాత మారేనా ?
India Vs England
Rakesh
|

Updated on: Jul 20, 2025 | 12:15 PM

Share

Ind vs Eng : లార్డ్స్ మైదానంలో 9 రోజుల్లోనే భారత జట్టుకు రెండో ఓటమి ఎదురైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు శనివారం, జూలై 19న జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనితో ఇంగ్లాండ్ మహిళల జట్టు మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ జూలై 22న జరగనుంది. ఈ మ్యాచ్‌లో సిరీస్‌ను ఎవరు కైవసం చేసుకుంటారో తేలిపోతుంది. లార్డ్స్ గ్రౌండ్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీని కారణంగా మ్యాచ్‌ను మొదట 29 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 29 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత వర్షం మరోసారి విలన్‌గా మారింది. దీంతో మ్యాచ్‌ను 24 ఓవర్లకు కుదించి, ఇంగ్లాండ్‌కు 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇంగ్లాండ్ జట్టు 21 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా ఆతిథ్య జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-1తో సమం చేసింది. మొదటి వన్డే మ్యాచ్‌ను భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుచుకుంది. రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు మొదటి మ్యాచ్‌లో చూపినంత దూకుడుగా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో వారి బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది.

వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టుకు ఆరంభం అంత బాగా లేదు. వారి బ్యాట్స్‌మెన్ తేమతో కూడిన పిచ్‌పై నిలదొక్కుకోలేకపోయారు. ప్రతిక రావల్ (3), హర్లీన్ డియోల్ (16), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (7), జెమీమా రోడ్రిగ్స్ (3), రిచా ఘోష్ (2) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. ఓపెనర్ స్మృతి మంధాన ఒక చివర నిలబడి జట్టు స్కోర్‌ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లింది. ఆమె 51 బంతుల్లో 42 పరుగులు చేసింది.

దిగువ ఆర్డర్‌లో దీప్తి శర్మ(30), అరుంధతి రెడ్డి (14) విలువైన పరుగులు చేసి జట్టు స్కోర్‌ను 143 పరుగులకు చేర్చారు. ఇంగ్లాండ్ తరఫున సోఫీ ఎక్లెస్టోన్ మూడు వికెట్లు తీయగా, ఎం ఆర్లోట్ రెండు వికెట్లు పడగొట్టింది. లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్ వేగంగా ఆరంభించింది. లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు అమీ జోన్స్(46), టామీ బ్యూమాంట్(34) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 54 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. స్నేహ్ రాణా బ్యూమాంట్‌ను అవుట్ చేసి భారత్‌కు మొదటి వికెట్‌ను అందించింది. ఆ తర్వాత కెప్టెన్ నాట్ సైవర్ బ్రంట్(21), జోన్స్ జట్టు స్కోర్‌ను 100 దాటించారు. ఈ మధ్యలో వర్షం మరోసారి విలన్‌గా మారింది.

వర్షం తగ్గిన తర్వాత ఇంగ్లాండ్ లక్ష్యం 29 ఓవర్లలో 144 పరుగుల నుంచి 24 ఓవర్లలో 115 పరుగులకు తగ్గించారు. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు 21 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ తరఫున క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీశారు. మూడో, చివరి వన్డే చెస్టర్ లీ స్ట్రీట్‌లో జూలై 22న జరగనుంది. అందులో సిరీస్ విజేత ఎవరో తెలుస్తుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..