
Team India Playing XI: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సాగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నాటింగ్హామ్ వేదికగా జరగనున్న మూడో సమరం టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ కండిషన్స్, భారత జట్టులో జరగబోయే కీలక మార్పులపై ప్రత్యేక విశ్లేషణ.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్లలో మొదటిది వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ క్రమంలో జులై 7, మంగళవారం రాత్రి గం. 10:00 లకు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగబోయే మూడో టీ20 మ్యాచ్ టీమిండియాకు ‘చావో రేవో’ లాంటిది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ సిరీస్ రేసులో నిలుస్తుంది, లేదంటే సిరీస్ చేజారడం ఖాయం.
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చేది భారీ స్కోర్లు. ఈ పిచ్ పూర్తిగా కఠినంగా, ఫ్లాట్గా ఉండటంతో బ్యాటింగ్కు విపరీతంగా అనుకూలిస్తుంది. బంతి బ్యాట్పైకి అద్భుతంగా వస్తుండటం, బౌండరీలు చాలా చిన్నవిగా ఉండటంతో ఇరు జట్ల పవర్ హిట్టర్లు భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే, కొత్త బంతితో ఇక్కడి పేసర్లకు ప్రారంభంలో కొంత స్వింగ్ లభించే అవకాశం ఉంది. స్పిన్నర్లకు ఈ పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించదు కాబట్టి, వారు తమ వ్యూహాలను మార్చుకోకపోతే భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుంది.
ఈ కీలక మ్యాచ్లో టాప్ ఆర్డర్ బాధ్యతాయుతంగా ఆడటం అత్యవసరం. యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా క్రీజులో నిలబడి జట్టుకు గట్టి పునాది వేయాలి. అరంగేట్రం మ్యాచ్లో నిరాశపరిచిన వైభవ్, ఈ మ్యాచ్లోనైనా తన ప్రతాపం చూపించాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గత మ్యాచ్లో చాలా నెమ్మదిగా ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కేవలం 110 స్ట్రైక్ రేట్తో ఆడటం జట్టును దెబ్బతీసింది. మిడిల్ ఓవర్లలో స్కోరు బోర్డును వేగంగా పరుగెత్తించే బాధ్యతను వీరిద్దరూ తీసుకోవాలి. అలాగే, ఇటీవలి కాలంలో అనవసర రనౌట్లతో వికెట్ పారేసుకుంటున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం బ్యాటింగ్లో రాణించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..
పిచ్ పరిస్థితులను బట్టి భారత మేనేజ్మెంట్ తుది జట్టులో ఒక కీలక మార్పు చేసే యోచనలో ఉంది. పేస్కు అనుకూలించే ఈ పిచ్పై ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లడం ప్రమాదకరమని భావించి, రవి బిష్ణోయిని పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ను జట్టులోకి తీసుకురావాలని యాజమాన్యం మొగ్గు చూపుతోంది. సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ ఆధారంగా ప్రిన్స్ యాదవ్కే అవకాశం దక్కేలా కనిపిస్తోంది. విదేశీ గడ్డపై ఒత్తిడిని అధిగమించి మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..