
IND vs AFG: బీసీసీఐ, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు పరస్పర అంగీకారంతో సెప్టెంబర్ 11 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను ఆడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాయి. అంతకుముందు ఆగస్టు 27న శ్రీలంకతో ముగిసే టెస్టు సిరీస్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు 10 నుంచి 12 రోజుల దాకా ఖాళీ సమయం దొరుకుతుందని అందరూ భావించారు. అయితే మధ్యలో దొరికిన ఈ విండోను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ను అకస్మాత్తుగా తెరపైకి తెచ్చింది. అసలు సమస్యల్లా ఇక్కడే మొదలయ్యాయి.
ఆరుగురు స్టార్ల మెడకు చుట్టుకున్న లీగ్ షెడ్యూల్
మరోవైపు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్ మూడో సీజన్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగాల్సి ఉంది. ఈ లీగ్లో ఆడేందుకు పంజాబ్కు చెందిన ఆరుగురు ప్రముఖ భారత ప్లేయర్లు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారు. ఫజిల్కా ఫాల్కన్స్ తరఫున శుబ్మన్ గిల్, అమృత్సర్ సూర్మాస్ తరఫున అభిషేక్ శర్మ, లుధియానా లయన్స్ తరఫున అర్ష్దీప్ సింగ్, జలంధర్ వారియర్స్ తరఫున ప్రభ్సిమ్రన్ సింగ్, మొహాలీ కింగ్స్ తరఫున రమణ్దీప్ సింగ్, బటిండా రాయల్స్ తరఫున గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగాల్సి ఉంది. ఇప్పుడు జాతీయ జట్టు తరఫున ఆఫ్గాన్ సిరీస్కు ఎంపికైతే వీరంతా పంజాబ్ లీగ్కు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Rishabh Pant: నీ కెరీర్ బతకాలంటే వెంటనే ఆ పని చేయ్.. పంత్ కు మాజీ దిగ్గజం ఉచిత సలహా
అభిషేక్, అర్ష్దీప్లకే ఎక్కువ రిస్క్
ఈ ఆరుగురిలో టీ20 ఫార్మాట్లో భారత జాతీయ జట్టులో నిలకడగా కొనసాగుతున్న ఆటగాళ్లు అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్లు మాత్రమే. టాప్ ఆర్డర్లో తీవ్రమైన పోటీ ఉన్నందున షుబ్మన్ గిల్కు ప్రస్తుతానికి టీ20ల్లో అవకాశం దక్కకపోవచ్చు. అలాగే రమణ్దీప్ సింగ్, ప్రభ్సిమ్రన్, గుర్నూర్ బ్రార్లు టీమ్ ఇండియా పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. అయితే, ఒకవేళ బీసీసీఐ కనుక ఈ ఆటగాళ్లందరినీ నేషనల్ డ్యూటీకి అందుబాటులో ఉండాలని ఆదేశిస్తే మాత్రం, వారు సొంత రాష్ట్ర లీగ్ను మధ్యలోనే వదిలేసి రాక తప్పదు.
లీగ్ యజమానులకు ఊహించని షాక్
వాస్తవానికి పంజాబ్ లీగ్ యాజమాన్యం అంతా కూడా షుబ్మన్ గిల్, అభిషేక్ శర్మల చుట్టూనే తమ టోర్నీ ప్రచారాన్ని హోరెత్తించింది. లీగ్ ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ మార్క్యూ ప్లేయర్లు మధ్యలోనే వెళ్లిపోతే లీగ్ గ్లామర్ తీవ్రంగా దెబ్బతింటుంది. మొదట్లో శ్రీలంక టెస్టుల తర్వాత వెస్టిండీస్ సిరీస్ వరకు మధ్యలో ఏ మ్యాచ్లు లేకపోవడం వల్లే పీసీఏ ఈ సమయాన్ని ఎంచుకుంది. కానీ బీసీసీఐ ఆఫ్గాన్ సిరీస్ను హఠాత్తుగా షెడ్యూల్ చేయడంతో ఈ చిక్కు వచ్చిపడింది. మరి బీసీసీఐ వర్క్లోడ్ దృష్ట్యా వీరిని విశ్రాంతికి పరిమితం చేస్తుందో లేక లీగ్ పూర్తి చేసుకునేందుకు అనుమతిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..