
IND vs ZIM T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నేడు చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు జరగనుంది. సూపర్-8 రౌండ్లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన భారత్కు, ఈ మ్యాచ్ ఇప్పుడు జీవన్మరణ సమస్యగా మారింది. సెమీస్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై గెలవడమే కాదు, భారీ ఆధిక్యాన్ని కూడా సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కీలక పోరు కోసం టీమ్ మేనేజ్మెంట్ ప్లేయింగ్ 11లో మేజర్ మార్పులకు సిద్ధమైంది.
ముఖ్యంగా గత మ్యాచ్లో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ విఫలం కావడం జట్టును దెబ్బతీసింది. అటు బంతితో వికెట్లు తీయలేక, ఇటు బ్యాట్తో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో నేటి మ్యాచ్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను తిరిగి జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమైంది. అక్షర్ రాకతో స్పిన్ విభాగం బలపడటమే కాకుండా, బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావిస్తున్నాడు.
మరోవైపు మిడిల్ ఆర్డర్ వైఫల్యాలు టీమిండియాను వేధిస్తున్నాయి. ఫినిషర్ రోల్లో ఆశలు పెట్టుకున్న రింకు సింగ్ వరుసగా 6, 1, 11, 0 వంటి తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. అలాగే యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నారు. ఈ క్రమంలో టీమ్ మేనేజ్మెంట్ సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. చెన్నైలోని నెమ్మదైన పిచ్పై స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సంజూకు మంచి రికార్డ్ ఉంది. నంబర్ 3 లేదా 4 స్థానాల్లో సంజూను ఆడించి జట్టును సెట్ చేయాలని చూస్తున్నారు.
ఇక చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం అన్న సంగతి తెలిసిందే. దీంతో కుల్దీప్ యాదవ్ను ట్రంప్ కార్డ్గా వాడుకోవాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది. కుల్దీప్ మాయాజాలంతో మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తే జింబాబ్వేను తక్కువ స్కోరుకే కట్టడి చేయవచ్చని ప్లాన్ చేస్తున్నారు. అటు వరుణ్ చక్రవర్తి, ఇటు కుల్దీప్ ఇద్దరూ కలిసి జింబాబ్వే బ్యాటర్లకు చుక్కలు చూపించే అవకాశం ఉంది.
భారత జట్టు ప్లేయింగ్ 11 (అంచనా)
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..