
Manav Suthar: గాలే టెస్టులో భారత్ శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ ఎడమచేతి స్పిన్నర్ మానవ్ సుతార్ కొత్త బంతితో ప్రభావం చూపించాడు. ఇన్నింగ్స్లోని 8వ ఓవర్లో అతడు వేసిన బంతికి శ్రీలంక డెబ్యూ ఆటగాడు పసిందు సూరియబండారా చిక్కుకున్నాడు.
సూరియబండారా బంతి టర్న్ అవుతుందని భావించి బ్యాక్ఫుట్పై ఆడేందుకు ప్రయత్నించాడు. సుతార్ వేసిన బంతి టర్న్ కాకుండా నేరుగా లోపలికి రావడంతో ప్యాడ్లను తాకింది. అంపైర్ అప్పీల్ను తిరస్కరించడంతో కెప్టెన్ శుభ్మన్ గిల్ వెంటనే డీఆర్ఎస్ తీసుకున్నాడు. బంతి ట్రాకింగ్లో వికెట్లను తాకుతున్నట్లు తేలడంతో థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు.
సూరియబండారాకు ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసే అవకాశం కూడా అనూహ్యంగానే వచ్చింది. శ్రీలంక సీనియర్ బ్యాటర్ దినేశ్ చండీమాల్ ఫీల్డింగ్ సమయంలో బౌండరీ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో మెడకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత సూరియబండారాను కన్కషన్ సబ్స్టిట్యూట్గా జట్టులోకి తీసుకున్నారు. టెస్టు డెబ్యూలో తన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన అతడికి సుతార్ మాత్రం క్రీజులో నిలిచే సమయం ఇవ్వలేదు.
సూరియబండారా వికెట్తో రెండు అరుదైన గణాంకాలు నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో టెస్టు అరంగేట్రంలో గోల్డెన్ డక్ అయిన తొలి శ్రీలంక బ్యాటర్గా అతడు నిలిచాడు.
అదే సమయంలో ప్రత్యర్థి జట్టు డెబ్యూ ఆటగాడిని టెస్టు తొలి మ్యాచ్లోనే గోల్డెన్ డక్ చేసిన తొలి భారత బౌలర్గా మానవ్ సుతార్ నిలిచాడు. భారత తరఫున చివరిసారిగా 1994లో అనిల్ కుంబ్లే వెస్టిండీస్కు చెందిన కామెరాన్ కఫీని డెబ్యూలో తొలి బంతికే ఔట్ చేశాడు.
మానవ్ సుతార్ ప్రదర్శన గాలే టెస్టులో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. కుంబ్లే తర్వాత 32 ఏళ్లకు ఓ ప్రత్యర్థి డెబ్యూ ఆటగాడిని తొలి బంతికే గోల్డెన్ డక్ చేసిన భారత బౌలర్గా సుతార్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..