
India vs New Zealand: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ వేదిక సిద్ధమైంది. రేపు (మార్చి 8) భారత్, న్యూజిలాండ్ జట్లు చారిత్రాత్మక అహ్మదాబాద్ మైదానంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమ్ ఇండియాకు కివీస్ గణంకాలు సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా మూడు కీలక అంశాల్లో న్యూజిలాండ్ జట్టు భారత్ కంటే ఎంతో బలంగా కనిపిస్తోంది. చరిత్ర నుంచి ప్రస్తుత టోర్నమెంట్ వరకు బ్యాటింగ్, బౌలింగ్ గణాంకాలను పరిశీలిస్తే కివీస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఎడిషన్లో భారత్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి కేవలం ఒక్క మాత్రమే ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ 8 మ్యాచ్ల్లో 5 గెలిచి, 2 ఓడిపోయింది (ఒకటి వర్షం వల్ల రద్దు). ఓవరాల్ టీ20 రికార్డుల్లో భారత్ 16-11తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, వరల్డ్ కప్ విషయానికి వస్తే కథ మారుతుంది. టీ20 ప్రపంచకప్లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు 3 సార్లు తలపడగా.. ఆ మూడు సార్లూ కివీస్ జట్టే విజయం సాధించడం గమనార్హం.
ఈ టోర్నీలో మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, ఈష్ సోధి వంటి స్పిన్నర్లతో న్యూజిలాండ్ అద్భుతాలు చేస్తోంది. కివీస్ స్పిన్నర్లు కేవలం 7.5 ఎకానమీతో పరుగులు ఇచ్చారు. అదే సమయంలో భారత స్పిన్నర్లు 8.3 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. అంటే భారత స్పిన్నర్లపై కివీస్ బ్యాటర్లు ఎదురుదాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వికెట్లు తీయడంలోనూ, పరుగులను కట్టడి చేయడంలోనూ కివీస్ స్పిన్ విభాగం భారత్ కంటే పొదుపుగా ఉంది.
ఈ టోర్నీలో న్యూజిలాండ్ బ్యాటింగ్ సగటు 41.68గా ఉండగా, భారత్ సగటు కేవలం 27.31 మాత్రమే. శ్రీలంక వంటి కష్టతరమైన పిచ్లపై ఆడినప్పటికీ కివీస్ బ్యాటర్లు మెరుగైన స్ట్రైక్ రేట్ను కొనసాగించారు. మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ఈ టోర్నీలో భారత బ్యాటర్లు 11 సార్లు డకౌట్ (సున్నా పరుగులు) కాగా, కివీస్ బ్యాటర్లు కేవలం రెండు సార్లు మాత్రమే ఖాతా తెరవకుండా వెనుదిరిగారు. ఇది భారత టాప్ ఆర్డర్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.