Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో ఘనత.. అయితే ఆ మాజీ ప్లేయర్స్‌కు వెనుకే..

|

Oct 18, 2024 | 6:55 PM

India vs New Zealand 1st Test Updates: భారత్ - న్యూజిలాండ్ మధ్య బెంగుళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. టెస్ట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని దాటిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, గావస్కర్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో ఘనత.. అయితే ఆ మాజీ ప్లేయర్స్‌కు వెనుకే..
Virat Kohli
Image Credit source: PTI
Follow us on

భారత్‌- న్యూజిలాండ్‌ (India vs New Zealand) తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకుని.. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు భారత మాజీ క్రికెటర్లు సచిన్‌ టెండుల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌, సునీల్‌ గావస్కర్‌ ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిన నాలుగో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న 18వ ప్లేయర్‌ కింగ్ కోహ్లీ కావడం విశేషం.

197 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ మైలు రాయిని చేరుకున్నాడు. మిగిలిన ముగ్గురు ఆటగాళ్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ టెస్ట్‌లో 9000 పరుగుల మైలురాయిని చేరేందుకు ఎక్కువ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ 176, సచిన్ టెండుల్కర్ 179, సునీల్ గావస్కర్ 192 టెస్ట్ ఇన్నింగ్స్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరారు.

9000 పరుగుల మైలురాయిని చేరిన కోహ్లీ..

టెస్ట్‌లో సచిన్ 15,921, ద్రవిడ్ 13,265, గావస్కర్ 10,122 పరుగులు సాధించారు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు టెస్ట్‌లో 9,018 పరుగులు సాధించాడు.

బెంగళూరు వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో రాణించాడు. కోహ్లీకి టెస్ట్‌లో ఇది 31వ అర్ధ శతకం. టెస్ట్ మ్యాచ్‌లో నెం.3 ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగి తొలి అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే మూడో రోజు చివరి బంతికి కోహ్లీ(70) ఔట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ 70 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. వారిద్దరూ మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మూడో రోజు ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ కంటే 125 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే చేతులెత్తేయగా.. న్యూజిలాండ్ 402 పరుగులు సాధించడం తెలిసిందే.

3వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా..

మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి