Watch : ఎందుకు పరుగెత్తలేదురా..?.. పిచ్‌పైనే గొడవ పడ్డ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ.. మైక్‌లో రికార్డ్

Watch : ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో రనౌట్ తర్వాత ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మధ్య జరిగిన మాటల యుద్ధం స్టంప్ మైక్‌లో రికార్డైంది. కమ్యూనికేషన్ గ్యాప్‌తో వికెట్ కోల్పోయిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి క్రికెట్ అభిమానుల చర్చకు దారితీసింది.

Watch : ఎందుకు పరుగెత్తలేదురా..?.. పిచ్‌పైనే గొడవ పడ్డ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ.. మైక్‌లో రికార్డ్
Ind Vs Eng

Updated on: Jul 02, 2026 | 10:50 AM

Watch : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటికీ, మైదానంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. టీమిండియా ఇన్నింగ్స్ మొత్తం ముగిసిన తర్వాత వర్షం పడటంతో ఆటను నిలిపివేశారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 59 పరుగులతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 6 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో అభిషేక్ ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 1 రన్ చేసి అవుట్ కాగా, అదే ఓవర్లో ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. ఆ రనౌట్ తర్వాత అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మధ్య జరిగిన గొడవ స్టంప్ మైక్‌లో రికార్డైంది.

అసలు మైదానంలో ఏం జరిగిందంటే?

ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ఇంగ్లాండ్ బౌలర్ బంతిని సంజూ శాంసన్ పాయింట్ దిశగా కొట్టి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్, అదే ఓవర్ చివరి బంతిని తేలికపాటి చేతులతో ఆడి రన్ కోసం ముందుకు పరుగెత్తాడు. అయితే బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడాన్ని గమనించిన నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ రన్ రావద్దంటూ గట్టిగా అరస్తూ నిరాకరించాడు. అప్పటికే సగం క్రీజు దాటేసిన ఇషాన్ కిషన్ మళ్లీ వెనక్కి తిరిగేలోపే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మెరుపు వేగంతో వికెట్లపైకి త్రో విసిరాడు. ఇషాన్ కిషన్ వికెట్లను కాపాడుకోవడానికి డైవ్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. థర్డ్ అంపైర్ ఇషాన్ అవుట్ అయినట్లు ప్రకటించాడు.

స్టంప్ మైక్‌లో రికార్డైన సంభాషణ

నిజానికి ఆ బంతికి రన్ తీయడం చాలా ప్రమాదకరం. అభిషేక్ శర్మ ముందే వద్దు అని గట్టిగా అరిచినప్పటికీ ఇషాన్ కిషన్ వినకుండా ముందుకు దూకాడు. అయితే ఈ రనౌట్‌ను థర్డ్ అంపైర్ స్క్రీన్‌పై చెక్ చేస్తున్న సమయంలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ దగ్గరకు వెళ్లాడు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం స్టంప్ మైక్ ద్వారా బయటకు వచ్చింది.

ఇషాన్ కిషన్: “నువ్వు ఎందుకు పరుగెత్తలేదు?”

అభిషేక్ శర్మ: “పరుగెత్తితే నేను క్రీజులోకి చేరుకునేవాడినా?”

ఇషాన్ కిషన్: “నాకు తెలియదు, చాలా క్లోజ్ కాల్ అది.”

అభిషేక్ శర్మ: “ఏం చేస్తున్నావ్ యా ఇషాన్?”

ఇషాన్ కిషన్: “బంతి నా ముందుకు వచ్చింది కదా, నేను పిలిచాను కదా !”

అభిషేక్ శర్మ: “కానీ ఫీల్డర్ ఎక్కడ నిలబడి ఉన్నాడో ఒక్కసారి నువ్వు చూసుకోవాలి కదా!”

ఈ విధంగా ఇద్దరు యువ ఆటగాళ్లు మైదానంలోనే ఒకరినొకరు తప్పు పట్టుకుంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఐసీసీ ర్యాంకింగ్స్ రేస్.. నంబర్-1 వర్సెస్ నంబర్-2

ఈ మ్యాచ్ జరగడానికి కొద్ది గంటల ముందే ఐసీసీ సరికొత్త టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. గత ఏడాది జూలై నుంచి టీ20ల్లో నంబర్-1 బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయాడు. అదే సమయంలో అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా అవతరించాడు. ఇలా ప్రపంచంలోని టాప్-2 ఇండియన్ బ్యాటర్లు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రనౌట్ కావడం, ఆ తర్వాత లైవ్ మ్యాచ్‌లోనే వాదించుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రనౌట్ తప్పిదం వల్ల ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉండి కూడా డకౌట్ రూపంలో వెనుతిరగాల్సి వచ్చింది.

Follow Us