Hardik Pandya : ఐపీఎల్ 2027కు ముందు పెను సంచలనం.. ధోని ఒక్క ఫోన్ కాల్‌తో మారిన హార్దిక్ పాండ్యా నిర్ణయం

Hardik Pandya : ఐపీఎల్ 2027కు ముందు హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎస్ ధోని ఫోన్ కాల్ తర్వాత సీఎస్‌కేలో చేరేందుకు హార్దిక్ ఆసక్తి చూపినట్లు కథనాలు చెబుతున్నాయి. ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Hardik Pandya : ఐపీఎల్ 2027కు ముందు పెను సంచలనం.. ధోని ఒక్క ఫోన్ కాల్‌తో మారిన హార్దిక్ పాండ్యా నిర్ణయం
Hardik Pandya Csk

Updated on: Jul 16, 2026 | 6:40 PM

Hardik Pandya : ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే లీగ్‌లో ఈక్వేషన్స్ చాలా వేగంగా మారుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ, మేనేజ్‌మెంట్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టును వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ట్రేడింగ్ వ్యవహారంలో ఒక ఊహించని మలుపు చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్ మహేంద్ర సింగ్ ధోని స్వయంగా హార్దిక్ పాండ్యాతో మాట్లాడటమే ఇందుకు ప్రధాన కారణం. ధోని నుంచి పిలుపు వచ్చిన తర్వాత హార్దిక్ తన నిర్ణయాన్ని పూర్తిగా మార్చుకుని సిఎస్‌కే వైపు వెళ్లడానికే మొగ్గు చూపినట్లు నివేదికలు వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా వదిలించుకోవడానికి ఇతర జట్లతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు హార్దిక్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. దీని కోసం హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి లేదా అంగ్‌క్రిష్ రఘువంశీ లాంటి కీలక ఆటగాళ్లను ముంబైకి ఇవ్వడానికి కూడా కేకేఆర్ మేనేజ్‌మెంట్ సుముఖత వ్యక్తం చేసింది. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం కేకేఆర్‌కు వెళ్లడానికి ఖచ్చితంగా నిరాకరించాడు. ఒకవేళ తనను ట్రేడ్ చేయాలనుకుంటే కేవలం చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రమే పంపాలని, లేదంటే తనను నేరుగా వేలానికి వదిలేయాలని ముంబై యాజమాన్యానికి స్పష్టం చేశాడు.

మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన చర్చల్లో ఆటగాళ్ల మార్పిడి ప్రతిపాదన వచ్చింది. ముంబై జట్టు శివమ్ దూబే, ఆయుష్ మ్హాత్రేలను అడగ్గా.. చెన్నై మాత్రం కేవలం దూబే, ఖలీల్ అహ్మద్‌లను మాత్రమే ఇస్తామని పట్టుబట్టింది. ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్‌ను పంపేందుకు సిఎస్‌కే ఒప్పుకుంది. అయితే ధోని రంగంలోకి దిగి హార్దిక్‌తో మాట్లాడిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చెన్నై మేనేజ్‌మెంట్ తమ కీలక ఆటగాళ్లను ఎవరినీ వదులుకోకుండా, కేవలం క్యాష్-డీల్ ద్వారా హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. హార్దిక్ కూడా చెన్నైకే రావాలని పట్టుబడుతుండటంతో ఈ ప్రతిపాదనకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

హార్దిక్ పాండ్యా వేలానికి వెళితే ముంబై ఇండియన్స్‌కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ట్రేడింగ్ ద్వారా ఒక ఆటగాడిని పంపితే భారీ మొత్తంలో ట్రేడింగ్ ఫీజు లభిస్తుంది. హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ జరిగితే ముంబైకి దాదాపు రూ.50 కోట్లకు పైగా నష్టం కలిగే అవకాశం ఉంది. అదే ఒకవేళ అతడిని నేరుగా వేలానికి వదిలేస్తే ముంబైకి ఎలాంటి ట్రేడింగ్ ఫీజు దక్కదు. చివరి నిమిషంలో హార్దిక్ తన నిర్ణయాన్ని మార్చుకుని కేవలం సిఎస్‌కేకే వెళ్తానని చెప్పడంతో ముంబై మేనేజ్‌మెంట్ తీవ్ర సందిగ్ధంలో పడింది. ఒకవేళ క్యాష్-డీల్ కింద చెన్నైకి పంపితే హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా మంచి ప్లేయర్‌ను ముంబై జట్టు కేవలం వేలంలోనే వెతుక్కోవాల్సి ఉంటుంది.

ముంబై ఇండియన్స్ జట్టులో కేవలం హార్దిక్ పాండ్యా మాత్రమే కాకుండా ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా మేనేజ్‌మెంట్ ప్రవర్తన పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీగ్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ విండో ద్వారా వేరే జట్టుకు పంపించే యోచనలో ఉందట. ఒకవేళ ఇదే నిజమైతే రాబోయే ఐపీఎల్ 2027 వేలానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో పెను మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరితే ధోని మార్గదర్శకత్వంలో సిఎస్‌కే జట్టు మరింత పటిష్టంగా మారుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us