Gautam Gambhir : టీమిండియా వరల్డ్ కప్ విజయం.. జై షా చేసిన ఆ ఒక్క కాల్ వల్లే సాధ్యమైంది: గౌతమ్ గంభీర్
Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోతోంది. విమర్శలు ఎదురైనా, ఆరోపణలు వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టి భారత్కు వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ (2026) అందించి చరిత్ర సృష్టించారు.

Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోతోంది. విమర్శలు ఎదురైనా, ఆరోపణలు వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టి భారత్కు వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ (2026) అందించి చరిత్ర సృష్టించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ను చిత్తు చేసి భారత్ ఛాంపియన్గా నిలవడంలో గంభీర్ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి భారత కోచ్గా గంభీర్ రికార్డు సృష్టించిన ఈ తరుణంలో, ఆయన తన మనసులోని ఒక చేదు జ్ఞాపకాన్ని, తనకు అండగా నిలిచిన ఒక వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కష్టకాలంలో తోడు నిలిచిన జై షా
టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నా, ఒకానొక సమయంలో గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లలో భారత్ ఓడిపోయినప్పుడు గంభీర్ను అందరూ టార్గెట్ చేశారు. ఆ సమయంలో తన బాధను ఎవరూ పట్టించుకోలేదని, కేవలం ఐసీసీ ఛైర్మన్ జై షా మాత్రమే తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని గంభీర్ గుర్తు చేసుకున్నారు. “న్యూజిలాండ్తో ఓడిపోయి ముంబై ఎయిర్పోర్టులో దిగులుగా ఉన్నప్పుడు జై షా ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండు గంభీర్.. మన టైం వస్తుంది అని ఆయన ఇచ్చిన భరోసాను నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని గంభీర్ ఎమోషనల్ అయ్యారు.
కోచ్ పదవి ఆఫర్ వెనుక అసలు కథ
అసలు గంభీర్ టీమిండియా కోచ్గా ఎలా ఎంపికయ్యారో కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ఐపీఎల్ 2024 సమయంలో కేకేఆర్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుండగా జై షా నుంచి తనకు కాల్ వచ్చిందట. “నేను నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, దీనికి నువ్వు నో చెప్పకూడదు.. నువ్వు టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకోవాలి” అని జై షా అన్నారట. ఆ మాట విన్నప్పుడు గంభీర్ షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు ఆయనకు హెడ్ కోచ్గా అనుభవం లేదు. కానీ గంభీర్ సామర్థ్యం మీద నమ్మకంతో జై షా ఆ బాధ్యత అప్పగించారు. ఆ నమ్మకాన్ని గంభీర్ ఈరోజు వరల్డ్ కప్ విజయంతో నిజం చేసి చూపించారు.
కోచ్గా గంభీర్ మార్క్
2024లో రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న తర్వాత గంభీర్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జట్టులో అనేక మార్పులు చేశారు. ఆటగాళ్లలో దూకుడును పెంచడమే కాకుండా, విదేశీ గడ్డ మీద కూడా భారత్ సింహంలా గర్జించేలా ప్లాన్ చేశారు. క్రమశిక్షణ, కఠిన నిర్ణయాలతో టీమిండియాను ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా నిలబెట్టారు. ఈ విజయం తన ఒక్కడిదే కాదని, జట్టు సభ్యులతో పాటు తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన జై షాకు కూడా దక్కుతుందని గంభీర్ సగర్వంగా ప్రకటించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
