T20 World Cup 2026 : హిస్టరీ క్రియేట్ చేసిన గంభీర్.. టీమిండియా గెలుపు క్రెడిట్ ఆ ఇద్దరికేనంటూ సంచలన ప్రకటన
T20 World Cup 2026 : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి టీమిండియా సృష్టించిన ప్రభంజనం ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. న్యూజిలాండ్ను చిత్తు చేసి 2026 టీ20 వరల్డ్ కప్ కిరీటాన్ని కైవసం చేసుకోవడం ద్వారా భారత్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

T20 World Cup 2026 : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి టీమిండియా సృష్టించిన ప్రభంజనం ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. న్యూజిలాండ్ను చిత్తు చేసి 2026 టీ20 వరల్డ్ కప్ కిరీటాన్ని కైవసం చేసుకోవడం ద్వారా భారత్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ విజయంలో ఆటగాళ్ల కృషి ఎంత ఉందో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు కూడా అంతే కీలకంగా నిలిచాయి. తన కోచింగ్లో భారత జట్టుకు రెండు ఐసీసీ టైటిళ్లు (2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్) అందించిన తొలి భారతీయ కోచ్గా గంభీర్ చరిత్ర సృష్టించాడు. అయితే, ఈ చారిత్రాత్మక గెలుపు తర్వాత గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచం మనసు గెలుచుకుంటున్నాయి.
వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో గంభీర్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ విశ్వవిజేత ట్రోఫీని తాను రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. నిజానికి ప్రస్తుత గెలుపుకు కోచ్గా గంభీర్ బాధ్యత వహించినప్పటికీ, ఈ ఘనతలో వారిద్దరి పాత్ర కూడా ఎంతో ఉందని గంభీర్ కొనియాడాడు. తన విజయంలో తన కంటే ముందు పనిచేసిన వారిని, తెరవెనుక కష్టపడే వారిని స్మరించుకోవడం గంభీర్ సంస్కారానికి నిదర్శనమని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గౌతమ్ గంభీర్ ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. రాహుల్ ద్రవిడ్ గతంలో హెడ్ కోచ్గా ఉన్న సమయంలో భారత జట్టులో నింపిన ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణే ఈరోజు జట్టు ఇంత బలంగా తయారవడానికి పునాది అని గంభీర్ భావిస్తున్నాడు. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆటగాళ్ల మానసిక స్థితిని మార్చడంలో ద్రవిడ్ చేసిన కృషి వెలకట్టలేనిదని అన్నాడు. ఇక బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ) హెడ్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ గురించి మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఫిట్నెస్, నైపుణ్యాలను సానబట్టడంలో లక్ష్మణ్ టీమ్ భారత క్రికెట్కు వెన్నెముకగా నిలిచిందన్నారు
కోచ్గా గంభీర్ సక్సెస్ వెనుక ఈ ఇద్దరు దిగ్గజాల శ్రమ కూడా దాగి ఉందని అతను బహిరంగంగా ఒప్పుకోవడం విశేషం. “ఒక చెట్టుకు పండ్లు కాస్తున్నాయంటే దానికి నీరు పోసి పెంచిన వారిని మర్చిపోకూడదు” అన్న చందంగా గంభీర్ వ్యవహరించాడు. ద్రవిడ్ వేసిన పునాదిపై, లక్ష్మణ్ పర్యవేక్షణలో తయారైన ఆటగాళ్లతో తాను ఈ విజయాన్ని సాధించానని గంభీర్ వినమ్రంగా చెప్పడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక ట్రోఫీ గెలుపు మాత్రమే కాదు, భారత క్రికెట్ వ్యవస్థలోని సమన్వయానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
