
Arshdeep Singh : భారత ఏ జట్టు పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆటలోనే కాదు, ప్రేక్షకులను అలరించడంలో కూడా తన స్పెషాలిటీ చూపించాడు. ఆదివారం అక్టోబర్ 5న కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ మధ్య జరిగిన మూడవ అనధికారిక వన్డే మ్యాచ్లో ఈ సరదా సంఘటన జరిగింది. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అర్ష్దీప్ సింగ్ పుష్-అప్లు చేసి, కొన్ని డ్యాన్స్ స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఉల్లాసపరిచాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయిన అర్ష్దీప్ సింగ్ బౌండరీ లైన్ దగ్గర నిలబడి అభిమానులతో సరదాగా ముచ్చటించాడు. ఈ క్రమంలోనే వారిని ఉత్సాహపరచడానికి అప్పటికప్పుడే కొన్ని పుష్-అప్లు, డ్యాన్స్ మూమెంట్స్ చేసి చూపించాడు. కాగా, అర్ష్దీప్ సింగ్ ఇటీవల ఆసియా కప్ 2025లో కూడా ఆడాడు. ఆ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలవగా, అర్ష్దీప్ రెండు మ్యాచ్లలో మూడు వికెట్లు తీసుకున్నాడు.
ఈ సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత్ ఏ జట్టు థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఏ నిర్దేశించిన 317 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఏ కేవలం 46 ఓవర్లలోనే ఛేదించి, 2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ కేవలం 68 బంతుల్లో 102 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ (62), రియాన్ పరాగ్ (62) తమ హాఫ్ సెంచరీలతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆస్ట్రేలియన్ స్పిన్నర్లు తన్వీర్ సంఘా, టాడ్ మర్ఫీ తలో నాలుగు వికెట్లు తీసినా విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఏ జట్టును భారత్ ఏ పేస్ ద్వయం అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రారంభంలోనే దెబ్బతీశారు. వీరిద్దరూ కలిసి ఆరు వికెట్లు పంచుకున్నారు. ఒకానొక దశలో ఆస్ట్రేలియా కష్టాల్లో పడినప్పటికీ, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అద్భుతంగా ఆడి 75 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.
ఎడ్వర్డ్స్ ఏడవ వికెట్కు లియామ్ స్కాట్ తో కలిసి 152 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లియామ్ స్కాట్ 64 బంతుల్లో ఒక ఫోర్, ఆరు సిక్సులతో 73 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీ కూడా 49 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సులతో 64 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా ఏ జట్టు 49.1 ఓవర్లలో 316 పరుగుల బలమైన స్కోరును నమోదు చేయగలిగింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..