
భారత్-ఇంగ్లాండ్ 2026 వన్డే సిరీస్లో అత్యంత కీలకమైన మూడో, చివరి మ్యాచ్ జూలై 19న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో ఈ పోరు విజేతను నిర్ణయించనుంది. రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి సిరీస్ను సమం చేయగా, ఇప్పుడు ఇరు జట్లు ట్రోఫీపై కన్నేశాయి.
రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ 66 పరుగులు, విరాట్ కోహ్లీ 65 పరుగులతో పోరాడినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలోనే విజయం సాధించింది. జో రూట్ 99 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడగా, విల్ జాక్స్ 30 పరుగులతో కీలక సహకారం అందించాడు. కాగా సిరీస్ డిసైడర్గా మారిన మూడో మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు (భారత కాలమానం) ప్రారంభం కానుంది.
లార్డ్స్ పిచ్ సంప్రదాయంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో మంచి సీమ్ మూవ్మెంట్, అదనపు బౌన్స్ లభించే అవకాశం ఉంది. అయితే బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశమూ ఉంటుంది. గణాంకాల ప్రకారం ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 289 పరుగులు, రెండో ఇన్నింగ్స్ సగటు 201 పరుగులు. ఇప్పటివరకు ఈ వేదికపై మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే మెరుగైన విజయశాతం నమోదైంది.
లండన్లో మ్యాచ్ రోజున వాతావరణం క్రికెట్కు అనుకూలంగా ఉండనుంది. ఉష్ణోగ్రత సుమారు 21 డిగ్రీల సెల్సియస్గా ఉండగా, వర్షం పడే అవకాశం కేవలం 3 శాతం మాత్రమే ఉంది. దీంతో పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇటీవలి పది వన్డే మ్యాచ్లలో భారత్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. భారత్ 8 విజయాలు నమోదు చేయగా, ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుత సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో మూడో వన్డేపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి