
Team India : టీ20 ప్రపంచకప్ 2026కు ఆతిథ్యమిస్తున్న టీమిండియాను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్, వరుసగా ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జ్వరం కారణంగా అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్కు దూరమవ్వగా, ఇప్పుడు అదే దారిలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా చేరిపోయాడు. మ్యాచ్ మధ్యలోనే అభిషేక్ అస్వస్థతకు గురికావడం అభిమానులను కలవరపెట్టింది.
అమెరికా మ్యాచ్ లో అసలేం జరిగింది?
శనివారం ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించినప్పటికీ, ఫీల్డింగ్ సమయంలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అమెరికా ఇన్నింగ్స్ మొదట్లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించినా, కొద్దిసేపటికే మాయమైపోయాడు. కనీసం డగౌట్లో కూడా ఆయన కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసలు విషయం బయటపెట్టారు. అభిషేక్ హఠాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారని, అందుకే ఆయనను విశ్రాంతి కోసం పంపాల్సి వచ్చిందని తెలిపారు.
కడుపు నొప్పితో విలవిల.. సిరాజ్ వెల్లడి
భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అభిషేక్ శర్మకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని, దాంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైదానాన్ని వీడారని చెప్పారు. ఆయన స్థానంలో సంజూ శామ్సన్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే, క్రికెట్ అభిమానులకు సిరాజ్ ఒక ఊరటనిచ్చే వార్త కూడా చెప్పారు. అభిషేక్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే మ్యాచ్ నాటికి ఆయన పూర్తి ఫిట్నెస్తో తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఫామ్ సమస్య.. పుంజుకోవాల్సిన సమయం
అభిషేక్ శర్మకు ఈ వరల్డ్ కప్ ఆరంభం అంత గొప్పగా లేదు. అమెరికాపై జరిగిన తన తొలి సీనియర్ ఐసీసీ మ్యాచ్లో కేవలం ఒక్క బంతి ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. దీనికి తోడు అనారోగ్యం కూడా చుట్టుముట్టడంతో ఆయన కొంచెం నిరాశలో ఉన్నారు. అయితే, నమీబియాతో జరగబోయే మ్యాచ్ లో తన బ్యాట్తో సమాధానం చెప్పాలని అభిషేక్ కసితో ఉన్నాడు. ఇప్పటికే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో బాధపడుతుండగా, బుమ్రా జ్వరంతో విరామం తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ఆటగాళ్లు త్వరగా కోలుకోవడం టీమిండియాకు చాలా అవసరం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..