
Shreyas Iyer: జింబాబ్వే పర్యటనలో భారత కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఎట్టకేలకు బిగ్ రిలీఫ్ లభించింది. హరారే వేదికగా జరిగిన తొలి టీ20 పోరులో జింబాబ్వేను ఏడు వికెట్ల తేడాతో మట్టికరిపించి భారత్ ఘన విజయాన్ని అందుకుంది. అయితే, మ్యాచ్ గెలిచినా జట్టు ప్రదర్శనలో మూడు కీలక లోపాలు స్పష్టంగా కనిపిస్తుండటం ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 13.2 ఓవర్లలోనే అత్యంత సునాయాసంగా ఛేదించింది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి వీరవిహారం చేయగా, ఇషాన్ కిషన్ 35 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో తమవంతు పాత్ర పోషించి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. దీనితో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!
జట్టు గెలిచినప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం మేనేజ్మెంట్ను తీవ్రంగా కలవరపెడుతోంది. తొలి రెండు బంతుల్లోనే బౌండరీలతో విరుచుకుపడే సత్తా ఉన్న అభిషేక్, ఈ మ్యాచ్లో 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వస్తున్న అతని ఫామ్లేమి ఇక్కడ కూడా కొనసాగడం గమనార్హం. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే భారత ఇన్నింగ్స్ కష్టాల్లో పడేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరోవైపు టీమిండియా బౌలింగ్ విభాగంలోనూ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. డెబ్యూ మ్యాచ్ ఆడిన యువ బౌలర్ అశోక్ శర్మ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన శివం దూబే ప్రభావం చూపలేకపోతున్నాడు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా మారడంతో బౌలింగ్ ప్రాక్టీస్ తగ్గించిన దూబే, ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 8 ఎకనామీతో ఏకంగా 32 పరుగులు ఇచ్చి అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. ఇతడిని ప్రాథమిక ఆల్రౌండర్గా కంటే పార్ట్టైమ్ బౌలర్గా వాడితేనే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..