AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదు.. బీసీసీఐ ఉపాధ్యక్షుడు క్లారిటీ ఇచ్చేశాడు

Rohit Sharma : రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై వస్తున్న రూమర్లకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెక్ పెట్టారు. లార్డ్స్‌లో 138 రన్స్ బాదిన 'హిట్‌మ్యాన్' టీమ్‌ఇండియాలో కొనసాగుతారని స్పష్టం చేశారు. గతంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.

Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదు..  బీసీసీఐ ఉపాధ్యక్షుడు క్లారిటీ ఇచ్చేశాడు
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 26, 2026 | 7:02 AM

Share

Rohit Sharma : టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ రోహిత్‌కి చివరి వన్డే కానుందంటూ వచ్చిన వార్తలపై బీసీసీఐ స్పందించింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించిన వార్తలన్నీ శుద్ధ అబద్ధాలని, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టంగా ప్రకటించారు. గతంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.

రాజీవ్ శుక్లా ఏమన్నారంటే?

ఆగ్రాలో జరిగిన యూపీ టీ20 లీగ్ మినీ వేలం కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ శుక్లా రోహిత్ శర్మ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. “రోహిత్ శర్మ మన భారత జట్టులో కీలక సభ్యుడు. ఆయన దేశం తరఫున ఆడటం కొనసాగిస్తారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం రోహిత్ రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన లేదా ప్రశ్నే లేదు” అని తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో హిట్‌మ్యాన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం

తన రిటైర్మెంట్‌పై పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలోనే రోహిత్ శర్మ లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌పై 138 పరుగుల చారిత్రాత్మక సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. తనను విమర్శిస్తున్న వారికి ఈ విధ్వంసకర శతకంతోనే సమాధానమిచ్చాడు. కాగా, రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వదంతులను పట్టించుకోను: రోహిత్ శర్మ

తనపై వస్తున్న పుకార్లపై రోహిత్ శర్మ స్వయంగా స్పందించాడు. బీసీసీఐకి ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రోహిత్, “బయట ప్రపంచంలో లేదా సోషల్ మీడియాలో తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తాను అస్సలు పట్టించుకోను. దేశం కోసం, టీమ్ కోసం అత్యుత్తమంగా ఆడటమే నా ముందున్న ఏకైక లక్ష్యం. నన్ను ఎప్పుడూ దేశం కోసం ఆడటానికే ప్రోత్సహించారు, భవిష్యత్తులో కూడా అలాగే ఆడతాను” అని తెలిపాడు.

రికార్డుల వేటలో హిట్‌మ్యాన్ రోహిత్

రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్ ఎంతో ఘనమైనది. ఇప్పటివరకు 288 వన్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్ ఏకంగా 11,895 పరుగులు సాధించాడు. తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 34 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకా ఎన్నో రికార్డులను తిరగరాసే సత్తా తనలో ఉందని ఈ లార్డ్స్ సెంచరీతో రోహిత్ మరోసారి నిరూపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us