Annabel Sutherland : మహిళా క్రికెట్ చరిత్ర తిరగరాసిన సదర్లాండ్.. భారత బౌలర్లను చెడుగుడు ఆడుకున్న ఆసీస్ వీరనారి

Annabel Sutherland : ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎనాబెల్ సదర్లాండ్ భారత్‌తో జరుగుతున్న టెస్టులో సెంచరీ బాది, వరుసగా 3 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. హిళా టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్ గా ఆమె రికార్డు క్రియేట్ చేసింది.

Annabel Sutherland : మహిళా క్రికెట్ చరిత్ర తిరగరాసిన సదర్లాండ్.. భారత బౌలర్లను చెడుగుడు ఆడుకున్న ఆసీస్ వీరనారి
Annabel Sutherland

Updated on: Mar 07, 2026 | 6:46 PM

Annabel Sutherland : ఒకవైపు భారత్ వేదికగా పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ ఫీవర్ ఊపేస్తుంటే.. మరోవైపు ఆస్ట్రేలియా గడ్డపై మహిళల క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు నమోదైంది. భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ ఎనాబెల్ సదర్లాండ్ చరిత్ర సృష్టించింది. పర్త్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో సదర్లాండ్ తన బ్యాటుతో టీమిండియా బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి, మహిళా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్‌లో సదర్లాండ్ అద్భుతమైన సెంచరీ (129 పరుగులు) సాధించింది. విశేషం ఏంటంటే.. మహిళా టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్ గా ఆమె రికార్డు సృష్టించింది. 2024లో సౌతాఫ్రికాపై డబుల్ సెంచరీ (210), 2025లో ఇంగ్లండ్‌పై 163 పరుగులు చేసిన సదర్లాండ్, ఇప్పుడు భారత్‌పై సెంచరీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. కేవలం 7 టెస్టుల కెరీర్‌లోనే 4 సెంచరీలు బాదిన ఆమె, మహిళా క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్ మాజీ క్రీడాకారిణి జానెట్ బ్రిట్టన్ (5 సెంచరీలు) మాత్రమే ఆమె కంటే ముందున్నారు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాను ఆస్ట్రేలియా బౌలర్లు మొదటి రోజే వణికించారు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లోనూ మెరిసిన సదర్లాండ్ 4 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఒక దశలో 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో సదర్లాండ్, ఎల్లీస్ పెర్రీ (76) తో కలిసి 128 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకుంది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు చేసి, ఏకంగా 125 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.

భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ సయాలీ సత్ఘరే ఆకట్టుకుంది. పట్టుదలగా బౌలింగ్ చేసిన ఆమె 4 వికెట్లు తీసి ఆసీస్ స్కోరును కట్టడి చేసే ప్రయత్నం చేసింది. అయితే సదర్లాండ్ ధాటికి భారత బౌలర్లు పైచేయి సాధించలేకపోయారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టు సాధించగా, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వరల్డ్ కప్ ఫైనల్ ముందు మహిళా జట్టుకు ఈ టెస్టు మ్యాచ్ గెలవడం అత్యంత కీలకంగా మారింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us