
జపాన్ ఓపెన్ టైటిల్తో మళ్లీ పాత ఫామ్నుందుకున్న పీవీ సింధు ఇప్పుడు చైనా ఓపెన్పై కన్నేసింది. మరోవైపు, గాయం కారణంగా స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమవ్వడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇటీవల ముగిసిన జపాన్ ఓపెన్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, దాదాపు రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించిన మన తెలుగు తేజం పీవీ సింధు మళ్లీ పాత రోజులను గుర్తుకుతెస్తోంది. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన అకానే యామగుచిని నేరుగా ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న ఆమె, అదే ఆత్మవిశ్వాసంతో చైనా ఓపెన్ 2026 బరిలోకి దిగుతోంది. టోర్నీ మొత్తంలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఆధిపత్యం చెలాయించిన సింధు, 2016లో కూడా చైనా ఓపెన్ విజేతగా నిలిచింది. దీంతో ఈసారి కూడా ఆమె నుంచి మరో పసిడి పతకాన్ని ఆశిస్తున్నారు మన క్రీడాభిమానులు.
ఈ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 1000 టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో సింధుతో పాటు దేవిక సిహాగ్, యువ సంచలనం ఉన్నతి హుడా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక పురుషుల సింగిల్స్లో యంగ్ సెన్సేషన్ లక్ష్యసేన్ మళ్లీ ఫామ్లోకి రావాలనే పట్టుదలతో ఉండగా, ప్రపంచ 24వ ర్యాంకర్ ఆయుష్ షెట్టి, అనుభవజ్ఞుడైన హెచ్.ఎస్. ప్రణోయ్ భారత్ తరుపున బరిలోకి దిగుతున్నారు. తీవ్ర పోటీ ఉండే ఈ విభాగంలో మన షట్లర్లు ఏ రకంగా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
భారత బ్యాడ్మింటన్లో అత్యంత విజయవంతమైన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ శెట్టి ఈ చైనా ఓపెన్కు దూరం కావడం భారత క్యాంప్కు పెద్ద ఎదురుదెబ్బ. జపాన్ ఓపెన్ సమయంలో తీవ్రమైన భుజం గాయంతో బాధపడిన సాత్విక్, ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పురుషుల డబుల్స్ ఆశలన్నీ ఎం.ఆర్. అర్జున్ – హరిహరన్ అమ్సాకరుణన్ జోడీపైనే ఆధారపడి ఉన్నాయి.
మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో – ధ్రువ్ కపిల జోడీతో పాటు రోహన్ కపూర్ – రుత్విక శివాని గద్దే జంట పోటీ పడుతోంది. అయితే, ఈసారి మహిళల డబుల్స్ విభాగంలో భారత్ నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఏది ఏమైనా, సింధు సూపర్ ఫామ్లో ఉండటం, కుర్రాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండటంతో చైనా ఓపెన్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్లన్నీ బిడబ్ల్యూఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి