యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. విష్ణు పుష్కరిణిలో 11 నుంచి స్నాన సంకల్పం.. ప్రారంభం

| Edited By: Surya Kala

Aug 06, 2024 | 12:47 PM

శ్రీ విష్ణుపుష్కరిణిలో స్నానమాచరించే దంపతులు లేదా ఇద్దరికి పురోహితులతో గోత్ర నామాల సంకల్పం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పిస్తామని ఈవో భాస్కర్రావు తెలిపారు. స్నాన సంకల్పం టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. దీన్ని ఆగస్టు 11వ తేదీ స్వాతినక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. విష్ణు పుష్కరిణిలో 11 నుంచి స్నాన సంకల్పం.. ప్రారంభం
Yadadri Temple
Follow us on

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు కొండపైనే గల విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే భాగ్యం కలగనుంది. ఇందు కోసం దేవస్థానం అధికారులు విష్ణు పుష్కరిణిని అందుబాటులోకి తీసుకురానున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని గత ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టింది. దీంతో యాదగిరిగుట్ట కొండపై ప్రధానాలయాన్ని విస్తరించారు. పదేళ్ల క్రితం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకునే దంపతులు, భక్తులు కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం ఆచరించేవారు. ప్రధానాలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద లక్ష్మీ పుష్కరిణిని ఏర్పాటు చేశారు. అప్పటినుండి భక్తులు కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో స్నాన సంకల్పం చేసుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ విధానంతో భక్తులకు ఇబ్బందిగా మారింది. దీంతో దేవస్థానం అధికారులు.. గతంలో మాదిరిగానే భక్తులకు విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం పునఃప్రారంభానికి ఏర్పాటు చేస్తున్నారు.

భక్తుల కోరిక మేరకు విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్నాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో భాస్కరరావు విష్ణు పుష్కరిణిని అధికారులతో కలిసి పరిశీలించారు. శ్రీ విష్ణుపుష్కరిణిలో స్నానమాచరించే దంపతులు లేదా ఇద్దరికి పురోహితులతో గోత్ర నామాల సంకల్పం నిర్వహించడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్వామివారి లడ్డూ సదుపాయం కల్పిస్తామని ఈవో భాస్కర్రావు తెలిపారు. స్నాన సంకల్పం టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. దీన్ని ఆగస్టు 11వ తేదీ స్వాతినక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

టికెట్ లేని భక్తులు విష్ణు పుష్కరిణిలో నీటిని తలపై చల్లుకునేందుకు వీలుకల్పిస్తారు. కాగా.. పుష్కరిణిలో చెత్తా చెదారాన్ని తొలగించి, పై భాగంలో జాలీ (మెష్)ఏర్పాటు చేసి, తెలుపు రంగు పెయింటింగ్ తో దేవస్థానం అధికారులు ముస్తాబు చేస్తున్నారు. గతంలో మాదిరిగానే కొండపై విష్ణు పుష్కరిణిలో స్థాన సంకల్పానికి అధికారులు ఏర్పాటు చేయడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం చేసి స్వామి వారిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. తిరిగి పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..