
సనాతన హిందూ సంస్కృతిలో పెద్దల పాదాలకు నమస్కరించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. గురువులు, స్వామీజీలు లేదా పెద్దలు మన తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తే.. దైనందిన జీవితంలోని అడ్డంకులు, ఆందోళనలు తొలగిపోయి పనులు శుభప్రదంగా పూర్తవుతాయని భక్తుల నమ్మకం. అయితే ఈ ఆశీర్వాదాన్ని కేవలం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మన శరీరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే.. కుడి భాగం సూర్యుడికి, ఎడమ భాగం చంద్రుడికి ప్రతీకగా నిలుస్తాయి. కుడి చేయి సూర్య శక్తికి అనుసంధానమై ఉంటుంది. అందువల్ల కుడి చేతితో ఆశీర్వదించడం వల్ల సానుకూల శక్తులు ప్రసరిస్తాయి.
మన శరీరంలో ఇడ, పింగళ అనే సూక్ష్మ నాడులు ఉన్నాయి. ఇందులో పింగళ నాడి కుడి వైపు శరీరానికి అనుసంధానమై ఉంటుంది. మెదడులోని ఎడమ భాగం కుడి వైపు శరీరాన్ని నియంత్రిస్తుంది. శాస్త్రీయంగా, కుడి చేతితో చేసే పనులు సానుకూల భావోద్వేగాలను పెంపొందించడంలో సహాయపడతాయి.
కుడి చేతితో ఆశీర్వదించినప్పుడు, ఆ శక్తి ఆశీర్వాదం పొందే వ్యక్తికి చేరడమే కాకుండా ఆశీర్వదించే వ్యక్తికి కూడా ఒక విధమైన శక్తి లభిస్తుంది. మన సంప్రదాయంలో పూజలు, హారతి, విభూతి ధారణ వంటి శుభ కార్యాలన్నింటికీ కుడి చేతినే ఎందుకు ఉపయోగిస్తారో ఇది స్పష్టం చేస్తోంది.
ఒకవేళ కుడి చేయి లేని పరిస్థితుల్లో ఎడమ చేతితో ఆశీర్వదించినా, అది కుడి చేతితో చేసినదానితో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక చేతికి రెండు చేతుల శక్తి ఉంటుందని నమ్మకం. కానీ రెండు చేతులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సూర్య మూలకాన్ని, శక్తిని పొందడానికి కుడి చేతిని ఉపయోగించడమే సముచితమని జ్యోతిష్య నిపుణులు సలహా ఇచ్చారు.