
ముల్లోకాలకు దేవదేవుడు సూర్య భగవానుడే. ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే ఎన్నో రకాల దోషాలు తొలగుతాయని పండితులు చెప్తున్నారు. స్వామి వారిని ఉదయాన్నే దర్శించి పూజా కైంకర్యాలు నిర్వహిస్తే ఈ ఏడాదంతా ఎన్నో శుభాలను చూస్తారట. అంతేకాదు ఉగాది అంటేనే సూర్య భగవానుడికి సంబంధించిన పండగ. ఆయన మార్పుతోనే నవగ్రహాలు సరికొత్త ప్రాధాన్యతను సంతరించుకుని ఆయా వ్యక్తుల జాతకాలను నిర్ణయిస్తుంటాయి. అందుకే ఈ రోజున పంచాంగ శ్రవణం వింటుంటారు. ఉగాది ఈ ఏడాది ఆదివారం వస్తోంది. ఈ రోజుకు అధిపతి సూర్యుడు. కాబట్టి పండగ నాడు అందరూ(ద్వాదశ రాశులు, 27 జన్మ నక్షత్రాలు) సూర్యనారాయణ మూర్తి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలని అంటున్నారు. సూర్య దేవాలయానికి వెళ్లలేని వారు సూర్యుడి ఉప ఆలయాలకు వెళ్లినా మంచి జరుగుతుందని చెబుతున్నారు. సూర్యుడి ఉప ఆలయాలు అంటే ప్రధాన సూర్య దేవాలయాలు కాకుండా, ఇతర దేవాలయాలలో సూర్యుడి విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్ఠించి, పూజలు నిర్వహిస్తారు.
ఎవరైతే ఈ ఆలయాలను దర్శించలేకుండా ఉన్నారో వారు ఇంట్లోనే ఆ చిన్నపాటి పని చేసి ఆ దేవదేవుడి ఆశీస్సులు పొందవచ్చు. ఉగాది రోజు స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి. ఆ నీటిలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిగిన అక్షతలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12 సార్లు చెప్పి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేసిన సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని అంటున్నారు.
ఒకవేళ పైన చెప్పినవి ఏదీ చేయలేకపోయినా సూర్యుడికి అధిష్ఠాన దైవమైనా శ్రీమన్నారాణయ ఆలయాన్ని దర్శించుకోవాలని చెబుతున్నారు. అంటే ఇలా విష్ణు సంబంధమైన రామాలయం, నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకున్న మంచి జరుగుతుందని అంటున్నారు. కాబట్టి ఉగాది రోజు విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్లి అర్చన లేదా అభిషేకం చేయించుకోవాలని, అలాగే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను 21 సార్లు చదవాలని అంటున్నారు.