Samatha Kumbh 2023: సమతా క్షేత్రంలో భగవద్గీత సూపర్ మెమోరియల్ టెస్ట్‌.. శ్లోకాలతో అబ్బురపరిచిన విద్యార్థులు..

|

Feb 09, 2023 | 6:32 AM

భగవద్గీత...! నేటి తరం విద్యార్థులకు పెద్దగా పరిచయం లేని పేరు. ఈ కాలం పిల్లలకు ఇందులోని శ్లోకాలు అంటే ఏంటో కూడా తెలీదు. కానీ సమతా క్షేత్రంలో విద్యార్ధులు మాత్రం..

Samatha Kumbh 2023: సమతా క్షేత్రంలో భగవద్గీత సూపర్ మెమోరియల్ టెస్ట్‌.. శ్లోకాలతో అబ్బురపరిచిన విద్యార్థులు..
Samatha Kumbh 2023
Follow us on

భగవద్గీత…! నేటి తరం విద్యార్థులకు పెద్దగా పరిచయం లేని పేరు. ఈ కాలం పిల్లలకు ఇందులోని శ్లోకాలు అంటే ఏంటో కూడా తెలీదు. కానీ సమతా క్షేత్రంలో విద్యార్ధులు మాత్రం.. అవపోసన పట్టేశారు. భగవద్గీత.. ఉపనిషత్తుల సారం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగముతో పాటు భగవంతుని తత్వం, ఆత్మ స్వరూపాన్ని బోధించే గ్రంథం. పాశ్చాత్య పోకడలో పడి.. భగవద్గీత శ్లోకాలు కాదు కదా.. అసలు భగవద్గీత అంటే ఏంటో కూడా ఈతరం విద్యార్థులకు పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేయడం లేదు. స్కూల్స్‌ యాజమాన్యాలకు ర్యాంకుల మీద దృష్టే తప్ప.. ఇలాంటి వాటిని అసలే పట్టించుకోదు.

కానీ.. సమతా క్షేత్రంలో విద్యార్థులు భగవద్గీతను అవపోసన పట్టారు. అధ్యాయం నంబర్ చెప్తే చాలు. శ్లోకం మొత్తాన్ని టపటపా చెప్పేస్తున్నారు. ఒక వేల శ్లోకం చెప్తే.. అది ఏ అధ్యాయంలో, ఎన్నో శ్లోకమనేది టపీమని చెప్పేస్తున్నారు. శ్లోకంలో మొదటి అక్షరాన్ని చెప్తే చాలు.. శ్లోకం మొత్తాన్ని చెప్తున్నారు. శ్రీ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన భగవద్గీత సూపర్ మెమోరియల్ టెస్ట్‌లో.. వేద విద్యార్థులు అదరహో అనిపించారు. భగవద్గీతను నీళ్లు నమిలినట్టు నమిలేశారు. పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని ఈ చిన్నారులు.. భగవద్గీత శ్లోకాలను అవపోసన పట్టేశారు. చిన్నారులు చిటికెలో ఇస్తున్న సమాధానాలకు.. భక్తులే కాదు.. అర్చక బ్రహ్మలు సైతం నివ్వెరపోయారు. పిల్లల ట్యాలెంట్‌కి విస్తుపోయి.. వీక్షించారు.

సమతా కుంభ్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏడో రోజు మధ్యాహ్నం వేదికపై భగవద్గీత సూపర్ మెమోరియల్ టెస్ట్ నిర్వహించారు. శ్రీ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో జరిగిన టెస్ట్‌లో వేద విద్యార్థులు, ప్రజ్ఞ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజ్ఞ అనేది చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా కేంద్రం. ఈ కేంద్రంలో స్టూడెంట్స్ కి చిన్న వయసు నుంచే భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తున్నారు. కేవలం ఇండియాలో ఉన్న విద్యార్థులకే కాదు .. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా ప్రాంత విద్యార్ధులకు కూడా భగవద్గీతను నేర్పిస్తున్నారు. నిన్న జరిగిన టెస్ట్‌లో అమెరికాకు చెందిన 45మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరితోపాటు వేద పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..