Hayagriva Jayanti: విష్ణువు అవతారల్లోకి ఒకటి.. విద్యార్థులు యాలకులతో పూజిస్తే మంచి విద్యనందించే హయగ్రీవ జయంతి రేపు

|

Aug 21, 2021 | 8:06 AM

Hayagriva Jayanti: యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. అలాంటి అనేక అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధి.. వాటిల్లో ముఖ్యమైనవి నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి..

Hayagriva Jayanti: విష్ణువు అవతారల్లోకి ఒకటి.. విద్యార్థులు యాలకులతో పూజిస్తే మంచి విద్యనందించే హయగ్రీవ జయంతి రేపు
Hayagreeva
Follow us on

Hayagriva Jayanti: యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. అలాంటి అనేక అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధి.. వాటిల్లో ముఖ్యమైనవి నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి ఈ అవతారాల్లో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అయితే తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారల్లోకి ఒకటి ‘హయగ్రీవావతారం’ ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు.. బ్రహ్మదేవుడి గురిం చి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్నవారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు.

వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణువేడారు. యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల … శరీరం నుంచి వేరై పోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాధి దేవతలు తమ జ్ఞానాన్ని.. శక్తి సామర్ధ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు.

ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా … జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతా రాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య – విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

విద్యార్థులకు జ్ఞానప్రదాత

హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. నారాయణుడు … హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధి స్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ … విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి వరం ఇచ్చింది.

” జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్‌
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే “

జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారరం. హయగ్రీవుడిని పూజించిన భక్తులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించ బడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.

హయగ్రీవ ప్రస్థావన

దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతినాడే ప్రారంభిస్తారు. హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.
హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. తెల్లపూవులతో పూజించాలి. శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి. సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు.

Also Read: Chanakya Niti: ఏ బంధమైనా నిలబడాలంటే ఏమి చెయ్యాలో చాణక్య చెప్పిన మూడు జల్లెడల కథ