
తిరుపతి, జనవరి 8: తిరుమలలో జనవరి 25న జరగనున్న రథసప్తమికి సంబంధించి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేశామని అధికారులందరూ అదే స్ఫూర్తితో రథ సప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనన్నారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
బందోబస్తు పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలనిఘాట్ రోడ్డు వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలన్న అదనపు ఈఓ.. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంజినీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ఈడీ స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కళా బృందాలు, ఎస్వీబీసీ, సోషియల్ మీడియాలో ప్రచారం ఏర్పాట్లపై కూడా సమీక్షించారు. టీటీడీ ఉన్నతాధికారులు విజిలెన్స్, పోలీసు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేసింది. తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించ బడవని స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.