AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడ్డు కాదు, పులిహోర కాదు.. ఈ ఆలయంలో ప్రసాదంగా డబ్బే ఇస్తారు!

Banoda Balaji Temple Prasadam: ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు దర్శనం అనంతరం భక్తులకు సాధారణంగా లడ్డు, పులిహోర వంటి ప్రసాదాలు అందిస్తారు. అయితే రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లాలో ఉన్న బానోడ బాలాజీ ఆలయం ఈ విషయంలో ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా డబ్బును కూడా అందించడం విశేషం.

లడ్డు కాదు, పులిహోర కాదు.. ఈ ఆలయంలో ప్రసాదంగా డబ్బే ఇస్తారు!
Banoda Balaji Temple
Rajashekher G
|

Updated on: May 09, 2026 | 12:13 PM

Share

సాధారణంగా ఆలయాల్లో లడ్డూలు, పులిహోర వంటి ప్రసాదాలను భక్తులకు అందిస్తారు. అయితే రాజస్థాన్‌లోని బానోడా బాలాజీ ఆలయంలో మాత్రం ప్రత్యేకమైన ఆచారం కొనసాగుతోంది. ఈ ఆలయంలో భక్తులు సమర్పించే కానుకల్లో కొంత భాగాన్ని తిరిగి వారికే ప్రసాదంగా ఇస్తారు. ముఖ్యంగా డబ్బును ప్రసాదంగా అందించడం ఇక్కడి విశేషం. ఈ ప్రసాదాన్ని భద్రంగా ఉంచుకుంటే ఐశ్వర్యం పెరుగుతుందని, వ్యాపారాల్లో లాభాలు వస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, తమ కోరికలు నెరవేరిన తర్వాత ప్రసాదంగా పొందిన డబ్బుకు మరికొంత జోడించి ఆలయానికి సమర్పించడం ఇక్కడి ఆనవాయితీగా కొనసాగుతోంది.

మహిమాన్వితమైన క్షేత్రంగా

ఈ కారణంగా బానోడ బాలాజీ ఆలయాన్ని మహిమాన్వితమైన క్షేత్రంగా భావిస్తారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, ఉత్సవాల సమయంలో రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

ఇక్కడ భక్తులకు డబ్బుతో పాటు లడ్డు, పులిహోర వంటి ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే అవి ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ విస్తరణ పనులు కూడా చేపడుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సమయంలో నిర్ణీత సమయాల్లోనే దర్శనానికి అనుమతులు కల్పిస్తూ భక్తుల సౌకర్యానికి చర్యలు తీసుకుంటున్నారు.

బనోడా బాలాజీ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు..

బనోడా బాలాజీ కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు.. ఇది 13 పవిత్ర దేవాలయాల సమాహారంగా వెలసిన విశిష్ట ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ ప్రతిష్ఠించబడిన ప్రాచీన, మహిమాన్విత పంచముఖి హనుమాన్ స్వామి, జగన్నాథుడు, ఖటుశ్యామ్ బాబా, శ్రీ శేషావతార్ కల్లాజీ విగ్రహాలు భక్తుల కోరికలను నెరవేర్చే దైవ శక్తులుగా విశ్వసిస్తున్నారు.

ఈ పుణ్యక్షేత్రానికి అసలైన ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తున్నది పండిట్ కైలాష్ శర్మ ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న రామాయణ పారాయణం. గత రెండు దశాబ్దాలుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 200కు పైగా గ్రామాల్లో ఈ పవిత్ర పారాయణం నిరవధికంగా సాగుతూ భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తోంది. అలాగే సిద్ధిదాత్రి దేవి ఆలయంలో నిర్వహించే విశిష్ట 16 రోజుల నవరాత్రి మహోత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షించే ప్రధాన ఆధ్యాత్మిక వేడుకగా ప్రత్యేక గుర్తింపు పొందాయి.

ప్రసాద వితరణ వీడియో..

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us