Vijayawada Durga Temple new EO Bramaramba : విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓ గా ప్రస్తుతమున్న సురేష్ బాబు బదిలీ అయ్యారు. అతని స్థానంలో దేవస్థానం జాయింట్ కమిషనర్.. నూతన ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ (ఈఓ) గా భ్రమరాంబ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి వాణీమోహన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సురేష్ బాబును ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రీజినల్ జాయింట్ కమిషనర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, దుర్గగుడిలో ఇటీవల ఏసీబీ అధికారులు సోదాలు చేసి దేవస్థానంలో అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం అప్పట్లో సస్పెండ్ చేసింది. దేవస్థానంలో గత రెండేళ్లుగా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అభియోగాలు మోపుతూ మరో నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అప్పట్లోనే ఈవో సురేష్ బాబు బదిలీ అవుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి.