నెమలిగా వచ్చి పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

Mayuranathar Temple: తమిళనాడులో ముఖ్యంగా అరుణాచలం, చిదంబరం లాంటి అనేక ప్రత్యేక శైవ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో మయూరనాథ దేవాలయం ఒక అతి పురాతన, అద్భుతమైన శివక్షేత్రం. ఈ ఆలయం భక్తులను మాత్రమే కాక, వైశిష్టమైన వాస్తు, కళా నైపుణ్యాలు.. దేశం, విదేశాల నుంచి యాత్రికులను ఆకర్షిస్తుంది.

నెమలిగా వచ్చి పార్వతీదేవి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.. ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
Mayuranathar Temple

Updated on: Feb 09, 2026 | 1:07 PM

తమిళనాడు రాష్ట్రం అనేక అద్భుత చారిత్రక ఆలయాలకు నెలవు. అందుకే ఈ రాష్ట్రాన్ని దేవాలయాల రాష్ట్రంగా పిలుస్తారు. తమిళనాడులో ముఖ్యంగా అరుణాచలం, చిదంబరం లాంటి అనేక ప్రత్యేక శైవ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో మయూరనాథ దేవాలయం(Mayuranathar Temple) ఒక అతి పురాతన, అద్భుతమైన శివక్షేత్రం. ఈ ఆలయం భక్తులను మాత్రమే కాక, వైశిష్టమైన వాస్తు, కళా నైపుణ్యాలు.. దేశం, విదేశాల నుంచి యాత్రికులను ఆకర్షిస్తుంది.

మయూరనాథ దేవాలయం ఎందుకు ప్రత్యేకం?

మహాశివుడు లింగ రూపంలో ప్రతిష్టితమైన అనేక ఆలయాల్లో మయూరనాథ ఆలయం భిన్నత విశేషంగా నిలిచింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. పార్వతీదేవి స్వయంగా మయూర రూపంలో (నెమలి రూపంలో) శివలింగాన్ని ప్రతిష్ఠించిన దేవాలయం ఇది. పూరాణాల ప్రకారం.. పార్వతీదేవి యజ్ఞగుండంలో ఎదురైన అవమానాలను, పాపాన్ని శుద్ధి చేసుకోవడానికి తన తదుపరి జన్మలో నెమలి రూపంలో జన్మించి.. ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు.

పార్వతీదేవి మయూర రూపంలో శివుని ప్రతిష్ఠించడం వలన ఈ ఆలయం.. “మయూరనాథ” అని పేరుపొందింది. భక్తులందరు ఇక్కడ శివుణ్ని మయూరనాథుడిగా, పార్వతీదేవిని అభయాంబిక, అభయప్రదాంబికగా పూజిస్తారు.

దేవాలయం ఎక్కడుంది..?

మయూరనాథ దేవాలయం.. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై (పూర్వం మాయవరం) గ్రామంలో ఉంది. తొమ్మిది అంతస్తుల రాజగోపురం, అద్భుతమైన శిల్పకళా సౌందర్యం, శిల్పాల వాస్తు నైపుణ్యం ఈ ఆలయాన్ని మరింత ఆకర్షణగా మార్చాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు, చరిత్రాసక్తులకు మనోహరమైన అనుభూతిని కలిగిస్తాయి.

స్థలపురాణం

ఆలయ స్థలపురాణం ప్రకారం.. దక్షప్రజాపతియాజ్ఞానికి పార్వతీదేవి హాజరు అయినప్పుడు యజ్ఞగుండంలో నెమలి పిల్ల భయపడి పార్వతీదేవి ఒడిలో దాక్కుంటుంది. ఆ యోగాగ్నిలో పార్వతీదేవి, నెమలి పిల్ల స్వయంగా ఆహుతి కాని విధంగా జ్ఞానపరమైన తపస్సు ప్రారంభిస్తారు. తద్వారా, ఆమె తదుపరి జన్మలో నెమలి రూపంలో పునర్జన్మ తీసుకుని, మయూరనాథుడిని ప్రతిష్ఠిస్తుంది.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

మయూరనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్టు కింద పార్వతీదేవి తపస్సు చేసిందని కథనాల ద్వారా తెలుస్తుంది. సమీపంలో ప్రవహించే కావేరీ నది వృషభ తీర్థంలో కలిసే ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమం అని పిలుస్తారు. ప్రతి పౌర్ణమి రోజున గంగ, యమునా, కావేరీ నదులు తమ పవిత్ర జలాలను కలిపి, భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధి అందిస్తాయని భావిస్తారు.

చిదంబరం నుంచి సుమారు 46 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. మయూరనాథ దేవాలయం చోళుల యుగంలో, క్రీ.శ. 9వ శతాబ్దంలో నిర్మితమని పురాతన శివాలయ శాసనాలు సూచిస్తున్నాయి. అద్భుతమైన చెక్క, శిల్పకళా, వాస్తు నైపుణ్యాలతో సమృద్ధిగా విరాజిల్లే ఈ ఆలయం, తమిళనాడులో అత్యంత మహిమగల పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తోంది.

విశేష ఉత్సవాలు

మహాశివరాత్రి, కార్తిక మాసం వంటి పవిత్ర సందర్భాల్లో మయూరనాథ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ఈ ఉత్సవాల్లో శివ భక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభూతి, ప్రశాంతత లభిస్తుంది. మయూరనాథ దేవాలయం, కేవలం శిల్పకళా ప్రదర్శన మాత్రమే కాక.. పరమశివ భక్తుల కోసం ఆధ్యాత్మిక ఆరాధనాకు ముఖ్య కేంద్రంగా నిలిచింది.