
హిందూ ధర్మంలో ప్రధాన పండగలలో మహాశివరాత్రి ఒకటి. ఈరోజున శివుడి ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనంలో వివరించారు. ఈ రెండు ఆచరణల ద్వారానే శివపూజ పరిపూర్ణమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉపవాసము అంటే భగవంతునికి “సమీపమునందు ఉండుట” అని అర్థం. కేవలం ఆహారాన్ని త్యజించడం ఉపవాసం కాదని, అది అశనము అవుతుందని ఆయన వివరించారు. ఇంద్రియాలను భగవత్ సేవలో నిమగ్నం చేయడమే ఉపవాస ప్రధాన లక్ష్యం. కళ్ళతో దైవ మూర్తులను, దక్షిణామూర్తి, నటరాజ, లింగ స్వరూపాలను దర్శించడం; చెవులతో భజనలు, స్తోత్రాలు, పురాణ ప్రవచనాలు వినడం; నాలుకతో భగవన్నామ స్మరణ, స్తోత్ర పారాయణం చేయడం; ముక్కుతో పవిత్ర నిర్మాల్య వాసనలను ఆస్వాదించడం ద్వారా భగవంతునికి చేరువ కావాలి.
ఒకే ఇంద్రియాన్ని నిరంతరం వాడితే మనసు విసిగిపోతుంది కాబట్టి, ఇంద్రియాలను మార్చి మార్చి భగవత్ ధ్యానంలో ఉంచాలని చాగాంటి కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ ప్రక్రియలో భగవంతుని గుణముల యందు కరిగిపోవడాన్ని “భక్తి” అంటారని, ఇది పంచదార నీటిలో కరిగిపోయినట్లుగా ఉంటుందని వివరించారు. కేవలం ఏదో కోరికతో దగ్గరవ్వాలని ప్రయత్నిస్తే అది “కామము” అవుతుందని, అది నీటిలో రాయిలా కరగకుండా గట్టిపడిపోతుందని ఉదాహరించారు.
ఉపవాసంలో ఆహార నియంత్రణ అనేది ఇంద్రియాలు సహకరించే విధంగా, శరీరం నీరసపడకుండా, నిద్ర రాకుండా సాత్విక ఆహారాన్ని పరిమితంగా తీసుకోవడం. కడుపు నిండా తింటే నిద్ర వస్తుందని, సాత్విక ఆహారం ఇంద్రియాలను భక్తికి అనుకూలంగా ఉంచుతుందని చాగంటి స్పష్టం చేశారు.
జాగరణం అంటే తమోగుణానికి వశపడకుండా, నిద్రపోకుండా ఉండడం. అయితే, ఇది కేవలం శారీరకంగా మేల్కొని ఉండడం కాదు. భగవద్గీతలో చెప్పినట్లు “యస్యా జాగర్తి సంయమీ” అంటే, లోకమంతా నిద్రలో ఉండగా, అంతర్ముఖుడై ఆత్మ విచారణ చేసే యోగిలాగా జ్ఞానంతో మేల్కొని ఉండడం. అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకోవడానికి భగవత్ జ్ఞానమనే దీపాన్ని వెలిగించడం. రాత్రంతా భజనలు, అభిషేకాలు, పూజలు చేస్తూ, ఇంద్రియాలను భగవత్ కైంకర్యంలో ఉపయోగించి నిద్ర రాని స్థితిలో నిలబడాలి. బలవంతంగా నిద్రను నిగ్రహించడం కాకుండా, తెల్లవారిపోయిందే అన్నంతగా భగవత్ సేవలో మునిగిపోవాలి. ఇలా చేసిన జాగరణం ఈశ్వరానుగ్రహానికి కారణమై, జ్ఞానము ఏర్పడి, “నేను ఆత్మ” అన్న అనుభవం, అద్వైతానుభూతిని కలిగిస్తుందని చాగాంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భావం చీకట్లను పోగొట్టడాన్ని సూచిస్తుందని ఆయన ఉదహరించారు.
మహాశివరాత్రి నాడు ఉపవాసం, జాగరణం పాటించేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు, విచక్షణతో వ్యవహరించాలి. ఉదాహరణకు, మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీర పోషణకు అవసరమైన సాత్విక ఆహారాన్ని (పండు ముక్క వంటివి) తీసుకుంటే అది ఉపవాస భంగం కాదని, దోషం కాదని ఆయన తెలియజేశారు. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. మహాశివరాత్రి అనేది ఈశ్వరానుగ్రహం కోట్ల జన్మలకు సరిపడగలిగినంతగా వెదజల్లబడే పరమ పుణ్యప్రదమైన కాలం. జన్మకు ఒక్క శివరాత్రినైనా సక్రమంగా ఆచరించి తరించాలని చాగాంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం అందుబాటులోని వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)