దేవుని ఉనికిపై జావేద్ అక్తర్‌తో ఘర్షణ.. ఇంతకీ మౌలానా ముఫ్తీ షామిల్ నద్వి ఎవరు?

దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్న ఇటీవల ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రఖ్యాత కవి, గేయ రచయిత జావేద్ అక్తర్ - ఇస్లామిక్ పండితుడు మౌలానా ముఫ్తీ షమీల్ నద్వీల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చర్చ తరువాత సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఇస్లామిక్ మత ప్రచారకుడు ముఫ్తీ షమీల్ నద్వీ ఎవరో తెలుసుకుందాం.

దేవుని ఉనికిపై జావేద్ అక్తర్‌తో ఘర్షణ.. ఇంతకీ మౌలానా ముఫ్తీ షామిల్ నద్వి ఎవరు?
Javed Akhtar, Mufti Shamail Nadwi

Updated on: Dec 22, 2025 | 8:36 AM

దేవుని ఉనికి గురించి గేయ రచయిత జావేద్ అక్తర్ – మౌలానా ముఫ్తీ షమైల్ నద్వి మధ్య జరిగిన యూట్యూబ్ ఛానల్ చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. ప్రఖ్యాత గేయ రచయిత జావేద్ అక్తర్ – ఒక యువ ఇస్లామిక్ పండితుడి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. దేవుడు ఉన్నాడా లేదా అనేది చర్చనీయాంశం. సృష్టికర్త లేకుండా గడియారాన్ని తయారు చేయలేకపోతే, సృష్టికర్త లేకుండా ఇంత సంక్లిష్టమైన విశ్వం ఎలా ఉంటుందని ముఫ్తీ షమైల్ వాదించారు. ఈ చర్చ తర్వాత, దేవుని ఉనికి గురించి తన వాదనలతో అకస్మాత్తుగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మౌలానా ముఫ్తీ షమైల్ నద్వి ఎవరో అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు.

మౌలానా ముఫ్తీ షమీల్ నద్వి ఒక ఇస్లామిక్ పండితుడు, వక్త, మత నాయకుడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మతపరమైన కుటుంబంలో జన్మించిన షమీల్ బాల్యం నుండే మతం, తత్వశాస్త్రం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన మత గురువు మాత్రమే కాదు, యువత భాషను మాట్లాడే శక్తివంతమైన వక్త కూడా. ఆయన భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇస్లామిక్ విద్యా సంస్థలలో ఒకటైన నద్వా-ఎ-ఉలేమా సంప్రదాయానికి చెందినవారు. ముఫ్తీ షామిల్ నద్వీ ప్రభావవంతమైన, సమతుల్య వక్తగా పేరు తెచ్చుకున్నారు. సంక్లిష్టమైన మతపరమైన అంశాలను కూడా సరళమైన భాషలో ప్రస్తావించగల సామర్థ్యం ఆయన ప్రసంగాల ప్రత్యేకత.

ముఫ్తీ షామిల్ నద్వీ ఇస్లామిక్ గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. మతపరమైన అంశాలపై తార్కిక, పండిత వాదనల్లో దిట్ట. దేవుడు, విశ్వాసం, నైతికత, ఆధునిక సవాళ్లపై ఆయన తరచుగా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరుస్తారు. భారతదేశంలోని ప్రఖ్యాత సంస్థ అయిన దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమా (లక్నో)లో ఆయన ప్రాథమిక, ఉన్నత ఇస్లామిక్ విద్యను పూర్తి చేశారు. పట్టభద్రులను నద్వీస్ అని పిలుస్తారు.

ఆయనకు ఇస్లామిక్ వేదాంతశాస్త్రం, ఖురాన్, హదీసులు, ఫిఖ్ (ఇస్లామిక్ చట్టం) లలో లోతైన జ్ఞానం ఉంది. ఆయన సమతుల్య అభిప్రాయాలు, తార్కిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు. అతను మర్కజ్-అల్-వహ్యైన్ అనే ఆన్‌లైన్ విద్యా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రిన్సిపాల్. అతను 2024లో వహ్యైన్ ఫౌండేషన్ అనే ఛారిటబుల్ ట్రస్ట్‌ను కూడా స్థాపించాడు. ఆయన యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇస్లామిక్ బోధనలను ప్రచారం చేసే ప్రముఖ వక్త. ఆయన తరచుగా నాస్తికత్వం, సైన్స్, ఇస్లాం వంటి అంశాలను చర్చిస్తారు. తన అంశాలను స్పష్టంగా, ఖచ్చితంగా ప్రదర్శించడం వల్ల యువతలో బలమైన ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు.

ముఫ్తీ షామిల్ నద్వీ వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. మతపరమైన అంశాలపై, ఆధునిక సమాజం, విశ్వాసం మధ్య సంఘర్షణపై, ఇస్లాంకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై తన అభిప్రాయాలపై ఆయన గతంలో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us