
హిందూ మతంలో శని దేవుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా శని దేవుడు అనుగ్రహం కలిగి సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. శని దేవుడు కర్మఫలదాతగా ప్రసిద్ధి. ఆయన కటాక్షం ఉంటే జీవితం స్థిరంగా, శ్రేయస్సుతో సాగుతుందని నమ్మకం. అయితే జాతకంలో శని ప్రభావం ప్రతికూలంగా ఉంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్వసిస్తారు. అందుకే శని ప్రభావం తగ్గి, ఆయన అనుగ్రహం పొందాలంటే శనివారం కొన్ని ఆచరణలు చేయడం మంచిదని భావిస్తారు.
శనివారం రోజున శని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరం. నెయ్యితో దీపం వెలిగించి, నల్ల నువ్వులు సమర్పించడం శుభప్రదం అని చెబుతారు. అలాగే శని మంత్రం లేదా గాయత్రి మంత్రం జపించడం ద్వారా శని దోష ప్రభావం తగ్గుతుందని నమ్మకం.
శనివారం రోజున ఆహారం, వస్త్రాలు, ధనం వంటి వాటిని దానం చేయడం పుణ్యకరమైనది. ముఖ్యంగా నల్ల దుస్తులు, శనగపిండి, నువ్వులు, నెయ్యి వంటి వస్తువులను అవసరమైన వారికి అందించడం ద్వారా శని అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.
శని ప్రభావం తగ్గాలంటే శివుడు, హనుమంతుడు ఆరాధన చేయడం మంచిదని పండితులు సూచిస్తారు. శివలింగానికి బిల్వపత్రాలతో అర్చన చేసి, ఆవుపాలను సమర్పించడం శుభప్రదం. శనివారం రోజున హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత కలిగి, శని ప్రభావం శాంతిస్తుందని విశ్వాసం.
శనివారం కాకులకు అన్నం, పప్పు పెట్టడం శుభకరంగా భావిస్తారు.
ఆలయంలో నవగ్రహ పూజలు చేయించడం మంచిది.
ఉదయం త్వరగా లేచి స్నానం చేసి ఉపవాసం ఉండడం ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుందని అంటారు.
“ఓం శనైశ్చరాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ సమాచారం ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా అందించబడింది. వ్యక్తిగత జాతక పరిస్థితులకు అనుగుణంగా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)