రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని తెలిపారు. దేశ రాజకీయాల్లో కచ్చితంగా మార్పు జరగబోతోందని, ఈ మార్పును ఎవరూ ఆపలేరన్నారు. యువకులు, మేధావులు మార్పు కోరుకుంటున్నారని, దేశాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి అద్వితీయమైన సమగ్ర పాలనా విధానం అవసరమన్నారు. కేంద్రంలో మార్పు వస్తేనే దేశం గతిలో మార్పు ఉంటుందని చెప్పారు. చైనా(China) ఎకానమీ 16 ట్రిలియన్ డాలర్లు అని, మనం ఇంకా 5 ట్రిలియన్ డాలర్ల దగ్గరే కలలు కంటున్నామని సీఎం పేర్కొన్నారు. బెంగళూరు( Bengaluru)లో మాజీ ప్రధాని దేవెగౌడ( Deve Gowda), మాజీ సీఎం కుమారస్వామి(HD Kumaraswamy)తో సుమారు మూడు గంటల పాటు భేటీ అయిన కేసీఆర్.. పలు కీలక అంశాలపై చర్చించారు. దేశ రాజకీయాలతో పాటు కర్ణాటక రాజకీయాలపై కూడా చర్చించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు .