ఆ జిల్లా నుంచే నలుగురు మంత్రులు.. అసలు టార్గెట్ అదేనా..?
కేసీఆర్.. రాజకీయాల్లో అపరచాణక్యుడుగా పేరు. ఎప్పుడు ఏ సమస్యను ఎలా అధిగమించాలో బాగా తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీచేసినా గెలిచిన రికార్డు కేసీఆర్ సొంతం. అంతేకాదు.. అనుకున్న వాళ్లని గెలిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితేనేం.. ఎంతటివారికైనా ఒక్కోసారి అంచనాలు తలకిందులవ్వడం సహజమే.. అందులో కేసీఆర్ మినహాయింపు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్కు ధీటుగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కూడా కొన్ని […]
కేసీఆర్.. రాజకీయాల్లో అపరచాణక్యుడుగా పేరు. ఎప్పుడు ఏ సమస్యను ఎలా అధిగమించాలో బాగా తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీచేసినా గెలిచిన రికార్డు కేసీఆర్ సొంతం. అంతేకాదు.. అనుకున్న వాళ్లని గెలిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితేనేం.. ఎంతటివారికైనా ఒక్కోసారి అంచనాలు తలకిందులవ్వడం సహజమే.. అందులో కేసీఆర్ మినహాయింపు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్కు ధీటుగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కూడా కొన్ని సీట్లలో గెలుపొందింది. అయితే ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కారు. అయితే 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ సీట్లను గెలుచుకుంది. అంతేకాదు.. ఇతర పార్టీల మహామహులంతా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇంత భారీగా సీట్లను గెలిచినప్పటికీ.. ఆరునెలలు తిరగకముందే ప్రత్యర్థి పార్టీలు అనూహ్యంగా పుంజుకున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ సారు.. కారు.. పదహారు అంటూ ప్రచారం చేసినా.. కేవలం 9 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రెండు పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లను గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతలు పార్లమెంట్లో పోటీచేసి ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. నిజామాబాద్లో కేసీఆర్ కూతురు కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అటు కరీంనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ కూడా బండి సంజయ్ చేతిలో ఓడిపోయారు. అయితే ఈ పార్లమెంట్ స్థానాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు భారీ మెజార్టీలతో గెలిచారు. దాదాపు అన్ని స్థానాల్లో టీఆర్ఎస్కు మంచి పట్టు ఉంది. అయితేనేం.. కమలదళం.. ఇక్కడ అనూహ్యంగా భారీ మెజార్టీలతో గెలుపొందింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు మొదలైంది. అసలు ఆరునెలల్లో బీజేపీ ఎలా గెలిచిందనే దానిపై ఫోకస్ పెట్టారు. కరీంనగర్ ఎంపీ స్థానంలో బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఇదే కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి.. ఓడిపోయారు బండి సంజయ్. అయితే బండి సంజయ్కి ఉన్న హిందుత్వ ఫాలోయింగ్తో పాటు.. మోదీ మానియా కూడా గెలుపు కారణాలయ్యాయి. అటు నిజామాబాద్లో పసుపు రైతుల ఆగ్రహంతో కేసీఆర్ కూతురు కవిత ఓటమిపాలయ్యారు. దీంతో కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెట్టారు. దానికి మంత్రి వర్గ విస్తరణనే విరుడుగా భావించినట్లు తెలుస్తోంది. తాజాగా కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దర్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారినే మంత్రిగా కేటాయించడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే మొత్తం నలుగురిని మంత్రులుగా చేయడం వెనుక.. అక్కడ పటిష్టమవుతున్న బీజేపీని ఎదుర్కొనేందుకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగురవేశాక.. బీజేపీ క్రమేపీ బలపడుతూ వస్తోంది. అయితే టీఆర్ఎస్ కంచుకోటలైన ఈ ప్రాంతం ఒకవేళ కమల దళం చేతిలో వెళ్తే.. బీజేపీ చెప్తున్నట్లుగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాగా వేయడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఇప్పటి నుంచే సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నారు. అందులో భాగంగానే తాజా కేబినెట్ విస్తరణలో కరీంగనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను తీసుకున్నారు. అటు సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్కు కూడా మంత్రి పదవిని కేటాయించారు. దీంతో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్లో ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్లతో కలిపి మొత్తం నలుగురు ఉన్నారు.
అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కారు స్పీడ్ పెంచేందుకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్లు కాపు సామాజికవర్గనికి చెందిన వారు. అయితే వీరికి చెక్ పెట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇస్తే.. ఆ వర్గం వారిని దగ్గరికి చేసుకోవచ్చన్న ఆలోచనతోనే.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగులకు మంత్రి పదవి కేటాయించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్పై పట్టుచిక్కాలంటే కరీంనగర్ ఎమ్మెల్యే ప్లస్ కాపు అయిన గంగుల ఉంటే బీజేపీని ధీటుగా ఎదుర్కోగలరని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నలుగురు మంత్రులు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతారో అన్నది వేచి చూడాలి.