తెలంగాణాలో ఆర్టీసీ సమ్మెకు ఊపునిస్తూ జెఏసీ, రాజకీయ పార్టీలు కలిసి పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ (ఛలో ట్యాంక్బండ్) ఇటు ముగిసిందో లేదో అటు ఏపీలో మరో మార్చ్ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏపీలో జరనున్నదానికి ఇసుక మార్చ్గా వామపక్షాలు నామకరణం చేశాయి. వివరాల్లోకి వెళితే..
ఏపీలో ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళన తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 3వ తేదీన విశాఖ కేంద్రంగా జనసేన పార్టీ నిర్వహించిన లాంగ్ మార్చ్ భారీ స్థాయిలో సక్సెస్సయ్యింది. జనసేన అధినేత లాంగ్ మార్చ్ వేదిక నుంచి ఏపీ ప్రభుత్వానికి పలు సవాళ్ళు విసిరారు. వామపక్షాలు, బిజెపి సంఘీభావం అంటూనే దూరంగా వుండి ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. టిడిపి నేతలు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు లాంగ్ మార్చ్కు హాజరయ్యారు.
అయితే.. సమావేశానికి హాజరైన వామపక్షాలు నవంబర్ 12,13 తేదీలలో ఇసుక మార్చ్ను నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఆ రెండు రోజుల్లో వామపక్షాల బృందాలు ఇసుక రీచ్లకు వెళ్ళి, ఇసుకను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడతారని వామపక్షాల నేతలు ప్రకటించారు. అడ్డుకుంటే పోరాటం ఆగేది కాదని సిపిఐ నేత రామకృష్ణ అంటున్నారు.
ఇసుక కొరతను తీర్చకపోతే ఉచిత ఇసుక ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించింది టీడీపీ. ఆత్మహత్య చేసుకున్న వారి భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు 25 లక్షలు, ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇసుకను తరలిస్తున్న వైసీపీ నేతల వాహనాల్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ.
నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్… నవంబర్ 9న హైదరాబాద్లో మిలియన్ మార్చ్.. తిరిగి నవంబర్ 12, 13 తేదీల్లో ఏపీలో ఇసుక మార్చ్.. సో.. తెలుగు రాష్ట్రాలను నవంబర్లోనే ‘మార్చ్’లు హోరెత్తిస్తున్నాయన్నమాట.