అమరావతి : ఏపీ శాసనసభ ఎన్నికల్లో జనసేనాని ఎక్కడినుంచి పోటీచేస్తాడన్న దానిపై తెరపడింది. చివరకు అన్నయ్య లానే తమ్ముడు కూడా రెండు చోట్ల నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. భీమవరం(పశ్చిమ గోదావరి), గాజువాక(వైజాగ్) నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. తాను పోటీ చేసే స్థానాలపై గంట తర్వాత వివరాలు చెప్తానని పవన్ మంగళవారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విస్తృతంగా చర్చలు జరిపిన పార్టీ నాయకులు.. మొత్తానికి పవన్ పోటీ చేసే స్థానాలను అధికారికంగా వెల్లడించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండడంతో తనకు కలిసొచ్చే అంశంగా పవన్ భావిస్తున్నారు. భీమవరంలో 2004 నుంచి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో కూడా పవన్ అన్న చిరంజీవి రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. సొంత జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో ఓడిపోయిన చిరంజీవి.. తిరుపతిలో విజయం సాధించారు.
భీమవరం, గాజువాక స్థానాల నుంచి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ @PawanKalyan pic.twitter.com/SuTHdhDRok
— JanaSena Party (@JanaSenaParty) March 19, 2019