అత్తా అల్లుళ్ళ ఆధిపత్య పోరు..రంగారెడ్డి రాజకీయం సూపర్బ్

|

Nov 13, 2019 | 2:01 PM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా ఆధిపత్య పోరుకు తెరలేచింది. అది కూడా అధికార టిఆర్ఎస్ పార్టీలోనేనని తెగ ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు మంత్రిగా వున్న పట్నం మహేందర్ రెడ్డికి, ఈ మధ్య గులాబీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి పొందిన సబితా ఇంద్రారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోందని చెప్పుకుంటున్నారు. ఏడాది క్రితం వరకు కొనసాగిన తన హవా ఒక్కసారిగా తగ్గిపోవడంతో మహేందర్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. అనుకోకుండా దొరికిన పట్టును కొనసాగించేందుకు […]

అత్తా అల్లుళ్ళ ఆధిపత్య పోరు..రంగారెడ్డి రాజకీయం సూపర్బ్
Follow us on

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా ఆధిపత్య పోరుకు తెరలేచింది. అది కూడా అధికార టిఆర్ఎస్ పార్టీలోనేనని తెగ ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు మంత్రిగా వున్న పట్నం మహేందర్ రెడ్డికి, ఈ మధ్య గులాబీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి పొందిన సబితా ఇంద్రారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోందని చెప్పుకుంటున్నారు. ఏడాది క్రితం వరకు కొనసాగిన తన హవా ఒక్కసారిగా తగ్గిపోవడంతో మహేందర్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. అనుకోకుండా దొరికిన పట్టును కొనసాగించేందుకు సబితా ఇంద్రారెడ్డి కూడా పట్టుదలతో వున్నట్లు తెలుస్తోంది.

మొన్నటి వరకు పట్నం మహేందర్ రెడ్డి మంత్రి. 2018 అసెంబ్లీ ఎన్నికలకు వరకు జిల్లాను శాసించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా…ఎమ్మెల్సీగా గెలిచి ఉనికి కాపాడుకున్నారు. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో మహేందర్ రెడ్డికి అత్త వరసయ్యే సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే ఆ అల్లుడు సైలెంట్‌ అయ్యారు. అల్లుడి అవకాశాలను అత్త దెబ్బ కొడుతోందని కథనాలొస్తున్నాయి.

గతంలో టిడిపిలో వున్న పట్నం మహేందర్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మహేందర్ రెడ్డి. నాలుగున్నరేళ్ల పాటు రవాణా మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నీతానై నడిపించారు. తన సోదరున్ని ఎమ్మెల్సీగా చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2014-18 మధ్య కాలంలో మహేందర్ రెడ్డి చెప్పిందే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేదంలా నడిచింది.

2018 వరకు ఆయన రాజకీయ జీవితం కూల్‌గానే సాగింది. కానీ ముందస్తు ఎన్నికలు మహేందర్‌రెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి మళ్లీ మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడే మళ్లీ మహేందర్‌రెడ్డికి కొత్త చిక్కు వచ్చిపడింది. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. మహేందర్‌రెడ్డికి ఆమె స్వయానా అత్త. ఆమె రాకతో మహేందర్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారింది.

ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో తనకు ప్లేస్‌ దక్కుతుందని ఆశించిన మహేందర్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. అత్త సబితా ఇంద్రారెడ్డి కేబినెట్‌లో చోటు దక్కడంతో అల్లుడిని పక్కనబెట్టారు. మహేందర్‌రెడ్డిని కేవలం వికారాబాద్‌ జిల్లాకు పరిమితం చేయడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇటు తాండూరు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో కూడా రెండు గ్రూపులు తయారయ్యాయి. దీంతో మహేందర్‌రెడ్డికి వర్గపోరు నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయ భవిష్యత్‌ ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన ఏదైనా నామినేటేడ్‌ పోస్టు దక్కించుకుని…జిల్లాలో చక్రం తిప్పాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఓవైపు మంత్రి పదవి లేదు. కనీసం మంత్రి పదవి దగ్గరగా ఉండే నామినేటేడ్‌ పదవి సంపాదిస్తే జిల్లాలో చక్రం తిప్పవచ్చి ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మొత్తమ్మీద అత్తా, అల్లుడి ఆధిపత్య పోరుపై జిల్లాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.